వైసీపీ మాఫియా .. ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు : యనమల
ఏపీలో పెన్షన్ల తొలగింపు అంశం రాజకీయంగా టీడీపీ, వై సీపీల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తుంది . ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది . పెన్షన్ దారుల పక్షాన పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ అందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తంగా నిర్ణయించినా విషయం తెలిసిందే. ఇక వైసీపీ సర్కార్ తీరుపై, వృద్ధులకు , వికలాంగులకు పెన్షన్లు తొలగించే అంశంపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఫిబ్రవరి 10న టీడీపీ మరో పోరుబాట: కారణం ఏమిటంటే
వైసీపీ మాఫియాలా పని చేస్తుందని మండిపడిన యనమల
తాజాగా యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ మాఫియాలా పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఏపీలో వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన యనమల గత ఎనిమిది నెలల్లో వైసీపీ మాఫియా పాలనతో పేదల పొట్టలు కొట్టారని మండిపడ్డారు. ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంతకాలం అర్హులైన నిరుపేద వృద్ధులు ఇప్పుడు ఎలా అనర్హులవుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .
రేషన్ కార్డులు, పింఛన్ల రద్దుతో పేదల పొట్ట కొట్టారని ఆగ్రహం
రేషన్ కార్డులు, పింఛన్ల రద్దుతో 26 లక్షల పేద కుటుంబాల పొట్టలు కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్డుల తొలగింపుతో రూ.1,500కోట్లు.. పెన్షన్ల రద్దుతో రూ.2,512కోట్లు ఎగ్గొట్టారని యనమల విమర్శించారు. అమ్మఒడి పథకం కింద ఒక్కో తల్లి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, యనమల రామకృష్ణుడు వైసీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి'కి మళ్లించారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు .
8 నెలల్లో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయని ఆగ్రహం
ఇక ఏపీకి కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారుయనమల . వైసీపీ మాఫియా దెబ్బకు పాత ఇన్వెస్టర్లు పారిపోయారని కొత్తవారు భయపడ్డారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో నాలుగు లక్షల ఉద్యోగాలను యువత కోల్పోయిందని, వైసీపీ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు.8 నెలల్లో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయన్నారు యనమల . పేదల పొట్టకొట్టి వైసీపీ మాఫియాను మేపుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు యనమల రామకృష్ణుడు .