కేంద్రంలో వైసీపీ మంత్రులు వీరే.. : ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ చేరుతుందా: ఢిల్లీలో ఏం జరిగింది..!
Recommended Video
కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందా. ఇంతగా ప్రచారం జరుగుతున్న వైసీపీ నేతలు ఎందుకు ఖండించటం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో దీని పైనే తర్జన - భర్జనలు. దీని పైనా స్వయం గా మోదీతో పాటుఆ ఆమిత్షా నుండి ఆహ్వానం. ఇతరత్రా సంప్రదింపులు..చర్చల కోసం రాం మాధవ్కు బాధ్యతలు. దీంతో.. జగన్ సైతం దీని పైనే లోతైన చర్చలు జరిపారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని...బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే జగన్ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరువుతున్నారని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ..
ఈ నెల 30న వరుసగా రెండో సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఆహ్వానించారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీతో కలిసిన సమయంలో ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా..కేంద్ర సాయం పైన స్పష్టత ఇస్తే చేరటానికి ఎటువంటి అభ్యంతరం లేదని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. మోదీ సూచనతో జగన్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన సమయంలో ఈ అంశం చర్చకు రాగా..జగన్ తన ఇబ్బందులను వివరించగా..అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని షా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత పార్టీ ముఖ్య నేత రాం మాధవ్ ఏపీ భవన్కు వెళ్లి జగన్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ సమయంలోనూ ఏపీలో రాజకీయ పరిణామాలు..కేంద్ర-రాష్ట్ర కేబినెట్లో ఇరు పార్టీలకు అవకాశం వంటి అంశాల పైన చర్చించారు.
వైసీపీ నుండి ముగ్గురికి అవకాశం..!
కేంద్ర కేబినెట్లో చేరటం పైన ఇప్పటి వరకు వైసీపీ నుండి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. అయితే, కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరటం ఖాయమైతే..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డితో పాటుగా సమీకరణాల్లో భాగంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎస్సీ వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్కు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. విజయ సాయిరెడ్డికి కేబినెట్ మంత్రిగా..బాలశౌరితో పాటుగా సురేష్కు సహాయ మంత్రులు గా అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. దీని పైన పార్టీలోని ముఖ్యలతో చర్చించి బుధవారం ఉదయానికి తుది నిర్ణయం చెబుతామని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ సైతం కేంద్ర కేబినెట్లో ఇద్దరు చేరటం.. తరవాత జరిగిన పరిణామాలను సైతం వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో ఉండటం వలన ఏపీకీ కేంద్రం నుండి సాయం విషయంలో మేలు జరుగుతుందనే చర్చ సాగుతోంది.
జగన్ కేబినెట్లో ఇద్దరు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ చేరితే..రాష్ట్రంలో సైతం బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో చేరుతారని సమాచారం. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటుగా సోము వీర్రాజు లేదా మాధవ్లలో ఒకరు జగన్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందంటూ చర్చ సాగుతోంది. దీని పైన మొత్తంగా బుధవారం స్పష్టత రానుంది. ఇప్పుడు జగన్ నిర్ణయం కోసం పార్టీ ఎంపీలు ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నారు.