చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు : వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్ లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈరోజు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సైతం ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల విషయంలో వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అదంతా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడిన అంబటి రాంబాబు అధికారం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అర్రులు చాస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష పార్టీ నేతలు ఏకగ్రీవాలు అనర్థం అని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.
పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పెలా అవుతుందని విపక్ష పార్టీల నేతలను దుయ్యబట్టారు. గ్రామాలలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఏకగ్రీవాలు జరుగుతుంటే సంతోషించాల్సింది పోయి ఏకగ్రీవాలపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని విమర్శించారు. ప్రతిపక్షాల ధోరణి శోచనీయంగా ఉందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి సమంజసం కాదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.