వైసీపీ మంత్రులు దుష్టశక్తులంటూ వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, విమర్శలు గుప్పించుకోవటం , బహిరంగ రచ్చలకు పాల్పడడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది . మొన్నటికి మొన్న ఉండవల్లి శ్రీదేవి పై వైసిపి బహిష్కృత నేతల ఆరోపణలు, ఆడియో లీకేజీలు వివాదంగా మారగా, అంతకుముందు అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఏకంగా కోర్టులకు వెళ్లిన పరిస్థితి ఉంది. తాజాగా వైసిపి మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.
రాష్ట్ర మంత్రులను దుష్ట శక్తులతో పోల్చిన ఎమ్మెల్యే చిట్టిబాబు
రాష్ట్ర మంత్రులను దుష్ట శక్తులతో పోల్చిన చిట్టిబాబు తన పాలిట మంత్రులు దుష్టశక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయినవిల్లి మండలం శంకరాయగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శంకరాయగూడెం సచివాలయం వివాదంలోనే మంత్రులను దుష్ట శక్తులతో పోల్చినట్లుగా తెలుస్తోంది. ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్ళు అయిన సందర్భంగా 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పీ గన్నవరం నియోజకవర్గంలో కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు .
మంత్రులు తనకు ప్రజలకు దూరం పెంచుతున్నారని ఆరోపణ
శంకరాయ గూడెం గ్రామానికి అన్యాయం జరిగిందంటే అది మంత్రుల వల్లనే అంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విమర్శించారు. సచివాలయ ఏర్పాటులో గ్రామస్తులకు ఒకలాగా, తనకు ఒకలాగా చెప్పి నియోజకవర్గ ప్రజలకు తనకు మధ్య దూరాన్ని పెంచుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినందుకే మంత్రులు తనకు సహకరించడం లేదని పేర్కొన్నారు. తనకు నియోజకవర్గ ప్రజల మధ్య మంత్రులు దూరం పెంచుతున్నారు అంటూ మండిపడ్డారు.
Recommended Video
వైసీపీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాట
తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా సొంత పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తరహాలో ఇప్పటికే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల తీరుపై గుర్రుగా ఉన్నారు . వైసీపీ లో అంతర్గత కుమ్ములాటలు , ఆధిపత్య యుద్ధాలు జరుగుతున్నాయని తాజాగా పీ గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వ్యాఖ్యలతో స్పష్టంగా అర్ధం అవుతుంది .