కన్నాకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి .. గురజాలలో ధర్నా అందుకేనా అంటూ ఫైర్
ఏపీలో బీజేపీ జగన్ సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళన చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. గ్రామ స్థాయి నుండి ప్రజలను అణచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడుతూ ఈ నెల 16న పల్నాడులో నిరసన దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో వైసీపీ నిరంకుశ , అణచివేత విధానాలకు నిరసనగా గురజాలలో ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు బీజేపీ నాయకులు .టీడీపీ ప్రభుత్వం కొంత కాలమైనా ఆగింది, కానీ, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎగిరి పడుతుందని కన్నా లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు . వైసీపీ నాయకుల్లో కనీసం ఓపిక కూడ లేదని ఆయన విమర్శించారు. .గ్రామస్థాయి నుండే ఉద్యోగాల తీసివేతతో పాటు, పోలీసు కేసులను నమోదు చేయిస్తూ ప్రజలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను జగన్ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయిన కన్నా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొంటున్నారని విమర్శలు గుప్పించారు . జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ఇక ప్రస్తుత ప్రభుత్వంలో వేగం లేదన్న ఆయన వైఎస్ జగన్ సర్కార్ వేధింపులకు నిరసనగా ఈ నెల 16వ తేదీన పల్నాడులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
జగన్ ను బీజేపీ వదిలిపెట్టదా ..? సుజనా చౌదరి వ్యాఖ్యల ఉద్దేశం అదేనా ?
ఇక బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే ఎవరి కోసం గురజాలలో ధర్నాకు పిలుపునిచ్చారని కన్నా లక్ష్మీ నారాయణను ప్రశ్నించారు. యరపతినేని అతని అనుచరుల కోసమే కన్నా ధర్నా చేస్తున్నాడా? అని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాటలు పట్టించుకోవద్దని హితవు పలికారు. . గురజాలలో ఏ బీజేపీ కార్యకర్త మీద దాడి జరగలేదని, కేసు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు.. పల్నాడు ప్రశాంతంగా ఉందని చెప్పిన ఆయన కన్నా ఎవరి ప్రయోజనాల కోసం ధర్నా చేస్తామని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ పల్నాడులో తమకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటుంది అన్న పరోక్ష వ్యాఖ్యలు చేశారు కాసు మహేష్ రెడ్డి . పల్నాడులో గతంలో లాగా అక్రమ మైనింగ్, గంజాయి రవాణ జరగడం లేదని , టీడీపీ హయాంలో జరిగేవని ఆయన పేర్కొన్నారు . కన్నా టీడీపీ నుంచి వచ్చిన వారి మాటలు కాకుండా స్వచ్ఛమైన బీజేపీ నేతలను విచారించి వాస్తవాలు తెలుసుకోవాలని కాసు మహేష్రెడ్డి సూచించారు. టీడీపీ నుండి వచ్చినవీరి మాటలు విని నిర్ణయం తీసుకోవద్దని చెప్పిన కాసు మహేష్ రెడ్డి ధర్నాపై తన అభ్యంతరం వ్యక్తం చేశారు .