ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా : వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదన
ఏపీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలులో కరోనా వైరస్ కేసులు పెరగటానికి కారణం అని పెద్ద ఎత్తున దుమారం లేచింది. సోషల్ మీడియాలో ఆయన మీద వార్తలు వైరల్ గా మారాయి . ఇక ఈ నేపధ్యంలో స్పందించిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని , నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని ఆయన పేర్కొన్నారు .
కర్నూలులో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. విస్తరణలో దేశంలోనే టాప్
కర్నూలు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో 158 పాజిటివ్ కేసులు నమోదయినట్టు సమాచారం . ఇక కర్నూలు జిల్లా కేసుల విషయంలో వేగంగా విస్తరించే జిల్లాగా దేశంలోనే తొలి స్థానంలో ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో థర్డ్ కాంటాక్ట్ పాజిటివ్ కేసులు అధికమని తేలినట్టు సమాచారం . మరోవైపు కరోనా కట్టడి కోసం జిల్లా యంత్రాంగం ఎంత ప్రయత్నం చేస్తున్నా కేసుల పెరుగుతున్న తీరు అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తుంది.
ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పై విమర్శల వెల్లువ .. సోషల్ మీడియాలో వైరల్
విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు కరోనా పాజిటివ్ రావటం అక్కడి సిబ్బందిని టెన్షన్ పెడుతుంది . ఇక దీంతో కర్నూలు జిల్లాలో ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో అడుగడుగునా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇలా కేసులు పెరగడానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కారణమని, మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి పరీక్షల విషయంలో ఆయన అధికారులపై ఒత్తిడి పెట్టారని , ఇక ప్రైవేట్ ఆస్పత్రుల మీద ఒత్తిడి పెట్టి ముస్లిం లకు వైద్యం చేయించారని , కేసులు బయటకు రాకుండా చూశారని, ఇంతగా ప్రబలటానికి ఆయనే కారణం అని కొందరు తీవ్ర ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దీనిపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించారు .
స్పందించిన ఎమ్మెల్యే ... నిరూపించాలని సవాల్
కర్నూలులో కరోనా కేసులు పెరగటానికి తానే కారణం అన్న ప్రచారం చెయ్యటం బాధాకరమని ఆయన ఆవేదన చెందారు . తనపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వల్లే కరోనా కేసులు పెరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని సవాల్ విసిరారు హఫీజ్ ఖాన్ . ముస్లిం గా పుట్టటమే ఇప్పడు ఈ ఆరోపణలకు కారణం అని ఆయన పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు .
నీచపు రాజకీయాలు చేసే వారే కుల మతాల గురించి మాట్లాడతారన్న ఎమ్మెల్యే
కరోనా కేసులు పెరిగితే దానికి, తనకు ముడి పెట్టడం సరికాదని ముస్లింలకు సహకరిస్తున్నారని కొందరు మాట్లాడుతున్న మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. నీచపు రాజకీయాలు చేసే వారే కుల మతాల గురించి మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు . మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చెయ్యాలని , ప్రభుత్వం మీద , ముస్లిం ల మీద ఒత్తిడి తెచ్చానని , తానూ సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. అయినా సరే ఇలాంటి రాజకీయాలు తన విషయంలో చెయ్యటం బాధాకరం అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.