టీడీపీ నేతలంతా లోకేష్ కాళ్ల దగ్గరే, జగన్.. సీఎం అవడం పక్కా : వైసీపీ ఎమ్మెల్యే
కర్నూలు : రాజకీయాల్లో వారసత్వాలు ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నవే. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా అంతా వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చేవారే. ఏపీ రాజకీయాల్లోను ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఆరంగేట్రానికి ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా.. లోకేష్ ఇప్పటికే తెర వెనుక చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. ఇక వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో జగన్ కూడా ఏపీలో బలమైన ప్రతిపక్ష గొంతు వినిపిస్తున్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీడిపీ నేతలపై ఫైర్ అయ్యారు వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే నారాయణస్వామి. జగన్ జలదీక్ష సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైఎస్ సీఎంగా ఉన్న హయాంలో ప్రభుత్వ విషయాల్లో జగన్ ఎప్పుడూ కల్పించుకోలేదని, అదే ప్రస్తుత సీఎం చంద్రబాబు తనయుడు అన్ని విషయాల్లోను జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
టీడీపీ ఎమ్యెల్యేలంతా లోకేష్ కాళ్ల దగ్గర పడి ఉన్నారని ఆరోపించిన ఆయన.. జగన్ పై లేని పోని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ రాయలసీమ సింహం అని ప్రశంసించారు. ఆత్మ గౌరవం కోసమే కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ను ఎదిరించి మరీ సొంత పార్టీ పెట్టారని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును వెన్నుపోటు నాయకుడని విమర్శించినవాళ్లే ఇప్పుడు చంద్రబాబు చెంతన చేరారని అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం జగన్.. పగలు రాత్రి కష్టపడితే, చివరకు చీము నెత్తురు లేనివాళ్లంతా టీడీపీలోకి వెళ్లిపోయారని ఆరోపించారు. నిజాయితీపరులైతే రాజీనామా చేసి పార్టీ మారేవారని విమర్శించిన నారాయణస్వామి, ఏదేమైనా.. జగన్ ముఖ్యమంత్రి కావడం మాత్రం ఖాయమని అప్పటిదాకా అందరం పోరాడాలని పిలుపునిచ్చారు.