ఎంపీ భరత్ ఏం పీకలేడు-జేడీ లక్ష్మీనారాయణతో ఫొటోలా : పిచ్చి చేష్టలతో పార్టీకి నష్టం : ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఏపీ అధికార పార్టీలో మరో ఎంపీ..ఎమ్మెల్యే మధ్య విభేదాలు ముదురుతున్నాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్...రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య కొంత కాలంగా ఆధిప్యత పోరు కొనసాగుతోంది. పార్టీ అధినాయకత్వం సీరియస్ అయి చెప్పటంతో కొంత కాలం కామ్ గా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు తిరిగి తమ పాత పంథాలోనే ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో గెలిచిన ఈ ఇద్దరు తొలి సారి చట్ట సభల్లోకి అడుగు పెట్టారు. ఎంపీగా భరత్ వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
రాజమండ్రిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
జక్కంపూడి రాజా మాజీ మంత్రి..సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు. అయితే, ఇద్దరి మధ్య సఖ్యత 2019 ఎన్నికల తరువాత ఎంతో కాలం నిలవలేదు. ప్రధానంగా రాజమండ్రి అర్బన్..రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల్లోనే వీరి మద్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆవ భూములు..ఇసుక ర్యాంపుల విషయంలోనూ ఆరోపణలు వినిపించాయి. అక్కడ అధికారుల నియామకాల మొదలు..నిర్ణయాల వరకు ఈ ఇద్దరిలో ఎవరి మాట వినాలో అర్దం కాక అధికారులు సైతం నలిగిపోతున్నారు.
ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంపీ భరత్ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీలో వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో..వీరిద్దరి మధ్య ముదురుతున్న వివాదాలతో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వీరిద్దరితో అప్పట్లోనే సమావేశమయ్యారు. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. సీఎం సీరియస్ గా ఉన్నారని..ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని నిర్దేశించారు.
పార్టీ సీరియస్.. సయోధ్య చేసినా ..మరలా
దీంతో..ఇద్దరూ కొంత కాలం బాగానే కనిపించారు. కానీ, ఈ రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాల్లో ఎవరికి వారు తమ అధిపత్యం ప్రదర్శించేందుకు మరలా పావులు కదుపుతున్నారు. రాజా కొద్ది రోజుల క్రితం వరకు కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పని చేసారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్..అర్బన్ వైసీపీ ఇన్ ఛార్జ్ లను మార్చాలంటూ ఎంపీ భరత్ పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే రాజా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేలకు జోడ పదవుల విధానం రద్దు చేయటంతో ఆయన పదవి కోల్పోయారు. ఇక, తాజాగా ఎంపీ భరత్ పైన ఎమ్మెల్యే రాజీ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఆ రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసమేనా..
ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో పార్టీని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సీబీఐ మాజీ జేడీతో భరత్ కు పనేంటని ప్రశ్నించారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతారా అంటూ నిలదీసారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారితో భరత్ కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటువంటి పిచ్చి చేష్టలతో పార్టీకి నష్టం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. కొద్ది రోజుల్లో రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికలు జరగనునున్నాయి. ఈ సమయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఫలితాల పైన ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, పార్టీకి చెందిన ఎంపీ..ఎమ్మెల్యే ఇలా ఓపెన్ గా విమర్శలు చేసుకోవటం పైన ఇప్పుడు సీఎం జగన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.