మరో వివాదంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి: ఎంపీడీవో ఇంటిపై దాడి: పీఎస్ వద్ద అధికారిణి బైఠాయింపు..!
ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో నిలుస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదం లో చిక్కుకున్నారు. ఆయన ఏకంగా ప్రభుత్వ అధికారిణి అయిన ఎంపీడీవో ఇంటిపై దాడి చేసారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ఇంటి పైన దాడి చేసారంటూ మహిళా అధికారిణి అర్ధరాత్రి ఆమే స్వయంగా నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదు తీసుకోవడానికి ఎస్సై గానీ, సీఐ గానీ లేరు. ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. సీఐ లేదా ఎస్సై స్టేషన్కు వచ్చేదాకా అక్కడే ఉంటానని సరళ బయట చెట్టు కింద కూర్చున్నారు. మండలంలోని గ్రామ కార్యదర్శులంతా ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇది టీడీపీ నేతలకు మరో అస్త్రంగా మారింది. గతంలో కోటంరెడ్డి వ్యవహార తీరు పైన టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.
దళితుడినని తొక్కేస్తున్నారు ... విడదల రజనీ బాటలో సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఎంపీడీవో ఇంటిపై కోటంరెడ్డి దాడి..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో ఇంటిపై కోటంరెడ్డి దాడి చేసారంటూ నేరుగా ఎంపీడీవో చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కల్లూరిపల్లి ఎంఐజీ కాలనీలోని తన ఇంటిపై దాడికి దిగారని ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేస్తున్నారు. తాను ఎంపీడీవోగా పని చేస్తున్న వెంకటాచలం మండలంలో వైసీపీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి సమీప బంధువు కృష్ణారెడ్డికి సంబంధించిన స్థలాల్లో లేఅవుట్ వేశారని.. అందులో తాగునీటి పైపులైన్లతోపాటు ఇతర సౌకర్యాలు సమకూర్చుకునేందుకు అనుమతులు ఇవ్వాలని శ్రీకాంత్రెడ్డి ఈ నెల 1వ తేదీన తన ఫోన్లో నుంచి రూరల్ ఎమ్మెల్యేతో తనతో మాట్లాడించారని తెలిపారు. 2వ తేదీ సాయంత్రానికి అనుమతులు పని పూర్తి కావాలని కోటంరెడ్డి సూచించారని పేర్కొన్నారు.
లేఅవుట్కు అనుమతులు ఇవ్వలేదని..
ఎమ్మెల్యే తనకు చెప్పిన సమయానికి ఆ రోజు సచివాలయాల ప్రారంభాలు ఉన్నందున అనుమతులు మంజూరు చేయడం కుదరలేదని.. శ్రీధర్రెడ్డి శుక్రవారం ఫోన్ చేసి.. తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నిస్తూ దూషణకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం కల్లూరిపల్లిలోని తన నివాసానికి ఆయన వచ్చారని.. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని.. తన తల్లి మాత్రమే ఉందని చెప్పారు. ఆమెను దూషించి నానా బీభత్సం సృష్టించారని, ఇంట్లోకి వచ్చే విద్యుత్ వైర్లను కట్ చేసి, తాగునీటి పైపులైను ధ్వంసం చేశారని వాపోయారు. చివరకు కేబుల్ వైర్లు సైతం ముక్కలు చేశారని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికి విషయం తెలుపగా.. ఆయన స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయించి, పైపులైను ధ్వంసం పనులను ఆపించారని సరళ చెప్పుకొచ్చారు. దీంతో..తాను పోలీసులను ఆశ్రయించానని సరళ చెప్పుకొచ్చారు.
పోలీసు స్టేషన్ వద్ద బైఠాయింపు..
పోలీసుల సూచన మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటానికి సరళ నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఫిర్యాదు తీసుకోవటానికి ఎస్సై గానీ, సీఐ గానీ లేరు. ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. సీఐ లేదా ఎస్సై స్టేషన్కు వచ్చేదాకా అక్కడే ఉంటానని సరళ బయట చెట్టు కింద కూర్చున్నారు. మండలంలోని గ్రామ కార్యదర్శులంతా ఆమెకు సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు. గతంలో ఒక జర్నలిస్టు పైన కోటంరెడ్డి వ్యవహరించిన తీరు పైన టీడీపీ అధినేత మొదలు ఆ పార్టీ నేతలంతా ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. పవన్ కళ్యాణ్ సైతం కోటంరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోరు..ఎందుకు కేసులు నమోదు చేయరని ప్రశ్నించారు. ఇప్పుడు మరో సారి కోటంరెడ్డి తీరు పైన ఆరోపణలు వస్తుండటంతో.. ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.