మురుగు కాల్వ లో ఎమ్మెల్యే నిరసన : దిగి వచ్చిన అధికారులు
ప్రజల ఇబ్బందిని అధికారులు పరష్కరించకపోవటాన్ని నిరసిస్తూ వైసిపి ఎమ్మెల్యే అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు లో ఈ నిరసన తెలిపారు. నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలియజేశారు. మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంనుంచి అడుగుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లినప్పటికి ఎవరూ స్పందించలేదు. దీంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సమస్యగా మారిన మురుగు కాలువలోకి దిగి నిలబడ్డారు.
అధికారులు వచ్చే వరకు తాను మురుగు కాలువలోనే ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అలా మురుగు కాలువలో ధర్నాకు దిగడంతో స్థానికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మురుగు కాలువలో నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి నచ్చ చెప్పి నిరసన విరమించపచేసే ప్రయత్నం చేసారు. ఆ తరువాత స్థానికంగా ప్రజలు కోరు తున్న విధంగా బ్రిడ్జి నిర్మాణం పై హామీ ఇచ్చారు. తొలి నుండి నెల్లూరు నగరంలోని ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు ప్రజల సమస్యల పై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అధికారులు సరిగ్గా వ్యవహరించకపోతే నిరసనలకు వెనుకాడటం లేదు . దీంతో..నెల్లూరు లో తాజాగా కోటంరెడ్డి చేసిన నిరసన హాట్ టాపిక్ గా మారింది.