అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే: విపక్షాలపై దేవినేని ఉమ ఫైర్
గుంటూరు/ విజయనగరం: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాలోని చెన్నాయపాలెం సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల్లో రైతులపై దాడి చేసిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.
పిన్నెళ్లి వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా గత రాత్రి నుంచి అదృశ్యమవడంతో వారు డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. చెన్నాయపాలెం సంఘటన కేసులో ఏక్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, తుపాను బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే విపక్షాలు మానవత్వం మరిచి మాట్లాతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు మాట్లాడే అర్హతే లేదన్న ఆయన పనిచేసే ప్రభుత్వంపై రాళ్లెయొద్దని హెచ్చరించారు.
చంద్రబాబు పనితీరు చూసి ప్రతిపక్షాలు ఈర్ష్య పడుతున్నాయని ధ్వజమెత్తారు. కేబినెట్, అధికారయంత్రాంగం మొత్తం తుపాను సహాయకచర్యల్లో పాల్గొంటోందని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనూ సహాయక చర్యలను విస్తరింపచేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.