టీడీపీ నూతన కార్యాలయానికి చిక్కులు: హైకోర్టులో ఆర్కే పిటీషన్: ప్రభుత్వానికి నోటీసులు..!
తెలుగుదేశం పార్టీ ఈ నెల 6వ తేదీన ప్రారంభించిన నూతన జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు గ్రామం వద్ద జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమయం నుండి వివాదాలు వెంటాడుతున్నాయి. అది ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి అయినా..టీడీపీ నేతలు నిబంధనలు అతిక్రమించి పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఇదే అంశం పైన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. దీనిపైన విచారణ ప్రారంభించిన హైకోర్టు ప్రభుత్వంతో పాటుగా జిల్లా కలెక్టర్ అదే విధంగా టీడీపీకి నోటీసులు జారీ చేసింది.
టీడీపీ కార్యాలయానికి చిక్కులు..
రాష్ట్ర విభజన తరువాత ఏపీలోనే ఎక్కువగా ఉంటున్న టీడీపీ అధినేత..తమ పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు గుంటూరులోని పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంగా వినియోగించారు. అయితే, ఈ నిర్మాణం కోసం స్థలం ఖరారు చేసిన సమయం నుండి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ స్థలం ఆక్రమించినదంటూ అప్పట్లోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేసారు.
ఆ తరువాత అది ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి..ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి ఆత్మకూరు గ్రామం గ్రామం జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మిస్తోందని కధనాలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థలాన్ని లీజుకు కేటాయించారు.
ప్రభుత్వ పోరంబోకుగా గుర్తించి..
టీడీపీ జాతీయ కార్యాలయం కోసం అప్పట్లోనే మూడు ఎకరాల 65 సెంట్లు ప్రభుత్వం కేటాయించగా.. నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ 392/2 సర్వే నంబర్లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దీని పైన కొద్ది రోజుల క్రితం ఆరోపణల పైన విచారించేందుకు రెవిన్యూ అధికారులు స్పందించారు.
ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఇదిలా కొనసాగుతుండగానే..ఈ వ్యవహారం న్యాయ పరమైన వివాదంగా మారింది.
హైకోర్టులో ఆర్కే పిటీషన్
ఇదే అంశం పైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రెవిన్యూ అధికారులు టీడీపీ కార్యాలయం నిర్మించిన స్థలం ప్రభుత్వ వాగు పోరంబోకు గా తేల్చినా..ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా అక్రమంగా నిర్మాణం పూర్తి చేసారని కోర్టులో పిల్ దాఖలు చేసారు. దీని పైన విచారణకు స్వీకరించిన హైకోర్టు మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వంతో పాటుగా జిల్లా కలెక్టర్ అదే విధంగా టీడీపీకి నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే ఆ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ నుండి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ కార్యాలయం న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవటం పైన టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.