బెదిరింపులొస్తున్నాయి...భద్రత పెంచండి...ప్లీజ్:డీజీపీకి వైసిపి ఎమ్మెల్యే ఆర్కే లేఖ
గుంటూరు:తనకు వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రత పెంచాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళవారం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు లేఖ రాశారు.
ఈ లేఖను ఆయనే స్వయంగా తీసుకెళ్లి డీజీపీకి అందజేశారు. రాజకీయ పోరాటాల నేపథ్యంలో అనేకమంది తనను టార్గెట్ చేశారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనకు గతంలో బెదిరింపు లేఖలు వచ్చిన విషయాన్ని కూడా ఆర్కే గుర్తుచేశారు. మావోయిస్టుల పేరిట కూడా తనకు బెదిరింపు లేఖలు వస్తున్నట్లు ఆర్కే వెల్లడించారు.
ఇటీవలి కాలంలో తనకు బెదిరింపులు ఎక్కువైన విషయాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డిజిపికి రాసిన లేఖలో వివరించారు. రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, ముఖ్యమంత్రి అక్రమ నివాసం, సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తాను న్యాయపోరాటాలు చేస్తున్న నేపథ్యంలో తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎపి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆర్కేకు వన్ ప్లస్ వన్ గన్మెన్ సెక్యూరిటీ అందజేస్తోంది. అయితే టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాల మీద ఎమ్మెల్యే ఆర్కే న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్కాల్స్ ఆయనకు వచ్చాయి. ఆ విషయాన్ని గతంలోనే ఆయన మీడియాకు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో బెదిరింపులు ఎక్కువడంతో పాటు మావోయిస్టుల పేరిట కూడా ఆర్కేకు బెదిరింపుల లేఖలు వస్తున్న నేపథ్యంలో తన భద్రతను పెంచాలని ఆయన డిజిపిని కోరారు. తనకు కనీసం టు ప్లస్ టు (2+2) గన్మెన్ సెక్యూరిటీ అందజేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.