మూడున్నారేళ్ల పోరాటం..అసెంబ్లీకి రోజా: చంద్రబాబు ముందే సభలోకి...నాడు సభలో జరిగిందేంటి..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సభ నుండి ఏకపక్ష బహిష్కరణకు గురయ్యారు. ఆనాటి నుండి నేటి వరకు అసెంబ్లీలో కాలు పెట్టేలేదు. న్యాయ పోరాటం చేసారు..నాటి సభలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ, రోజా కు సాధ్యపడలేదు. మూడున్నారేళ్ల పోరాటం తరువాత తిరిగి ఈ రోజు అధికార పక్ష శాసనసభ్యురాలిగా సభలో రాజ మార్గం లో ప్రవేశిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రోజాను సస్పెండ్ చేసారు. నేడు అదే చంద్రబాబు ముందే అధికార పార్టీ ఎమ్మెల్యేగా సభలో ప్రవేశిస్తున్నారు...
మూడున్నారేళ్ల క్రితం..
2015, డిసెంబర్ 18. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగుతున్న సమయం. విజయవాడ కాల్ మనీ వ్యవహరం పైన విపక్ష వైసీపీ సభలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. వైసీపీ నుండి మహిళా సభ్యురాలు రోజా ఇదే అంశం పైన సభలోనే ఉన్న ముఖ్యమంత్రి పైన కొన్ని కామెంట్లు చేసారు. దీంతో..ఆ వెంటనే సభలో నాటి శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు రోజాను ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సభలో ప్రతిపాదించారు. ఆ వెంటనే స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వెంటనే మూడ్ ఆఫ్ ది హౌస్ నిర్ణయంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిం చారు. దీని పైన విపక్ష నేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. కనీసం రోజా వివరణ వినాలని అభ్యర్దించారు. కానీ, స్పీకర్ ససేమిరా అన్నారు. ఆ వెంటనే రోజా సైతం వెంటనే సభ నుండి బయటకు వెళ్లి పోయారు. ఈ నిర్ణయం ద్వారా రోజాను సభ నుండి బహిష్కరించటం..కాల్ మనీ వ్యవహారం నుండి వైసీపీని సైడ్ ట్రాక్ పట్టించటమే లక్ష్యంగా నాడు టీడీపీ వ్యూహం అమలు చేసినట్లు కనిపించింది.
మూడున్నారేళ్లుగా రోజా పోరాటం..
తనను ఏకపక్షంగా..అన్యాయంగా ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేయటం పైన రోజా హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయం పైన న్యాయ పోరాటం చేసారు. తొలుత హైకోర్టు రోజాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సభలోకి రోజా ను అనుమతించాలని ఆదేశిస్తూ...విచారణ వాయిదా వేసింది. దీంతో..ఆ ఉత్తర్వుల మేరకు రోజా సభలోకి వచ్చేందుకు ప్రయత్నించగా..తమకు స్పీకర్ నుండి ఆదేశాలు లేవంటూ సిబ్బంది అడ్డుకున్నారు. దీని పైన సభలో స్పీకర్ నాడు ప్రకటన చేసారు. హైకోర్టు ఆదేశాలను సభలో అమలు చేయాల్సిన అవసరం లేదని..సభలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లగా..అక్కడ రోజాకు అనుకూలంగా ఇచ్చి న ఉత్తర్వులను రద్దు చేసారు. ఇక, ఏడాది కాలం పూర్తయిన తరువాత కూడా రోజా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా..సఫలం కాలేదు. ఇక, ఆ తరువాత వైసీపీ మొత్తంగా శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. దీంతో..నాటి నుండి రోజా శాసనసభకు దూరంగానే ఉన్నారు.
నేడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా..
మూడున్నారేళ్ల క్రితం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బహిష్కరణకు గురైన రోజా..తిరిగి నేడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా సభ లో అడుగు పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి నగరి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గెలుపొందారు. రోజా గెలుపును అడ్డుకొనేందుకు నాటి అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, రోజా విజయం సాధించారు. వైసీపీ అధికారం లోకి వచ్చింది. రోజాకు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, సామాజిక సమీకరణాలతో సాధ్యపడలేదు. దీంతో .. ఇక తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో సీట్లో ఉన్న సమయంలోనే రోజా అధికార పార్టీ ద్వారా నుండి సభలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో..ఈ సమావేశాల తొలి రోజు సభలో సెంట్రల్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారనున్నారు.