సభలో మరోసారి రోజా విశ్వరూపం: అచ్చంనాయుడు సమాధానం ఏది: తాట తీసి తోలు వలిచి..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన మాట్లాడిన రోజా చంద్రబాబు లక్ష్యంగా పదునైన విమర్శలు చేసారు. మహిళలను అడుగడుగునా అవమానించిన నాటి పాలకులకు ప్రజలు బుద్ది చెప్పారని విరుచుకుపడ్డారు. అచ్చంనాయుడు పైనా రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. పిచ్చి తుగ్లక్ పాలన అంతం అయిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారన్నారు. మాజీ స్పీకర కోడెల మీద పరోక్షంగా రోజా వ్యాఖ్యలు చేసారు.
తాట తీసీ తోలు వలచి..
గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చీటింగ్ చీఫ్ మినిస్టర్ అంటూ రోజా తన ప్రసంగం ప్రారంభించారు. ఎన్నికల్లో మోసం చేసిన వారిని ప్రజలు తాట తీసి తోలు వలచి కూర్చోబెట్టారని ఫైర్ అయ్యారు. కారు షెడ్లో ఉండాలి .. మహిళలు వంటిట్లో ఉండాలి అంటూ వ్యాఖ్యానించిన వారిని షెడ్కు పంపారని రోజా పరోక్షంగా నాటి స్పీకర్ కోడెల పైన విమర్శలు చేసారు. ఆడవాళ్ల పుట్టుకనే వ్యతిరేకించిన వారిని..రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేసిన వ్యక్తులకు బుద్ది చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చేతకాని దద్దమ్మ అంటూ విరుచుకుపడ్డారు. అటువంటి నేతలు సిగ్గు లేకుండా ఇప్పుడు వారు ఇచ్చిన హామీల అమలు కోసం జగన్ పైన పోరాటం చస్తామంటున్నారని..ఆ 23 మంది గుంజీ లు తీసి క్షమాపణ అడగాలి అని సూచించారు. డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అమ్మ ఒడి పధకం సైతం ఆరోగ్యశ్రీ..ఫీజు రీయంబర్స్మెంట్ పధకాల తరహాలోనే దేశంలోనే పేరు సాధించే పధకం అవుతుందన్నారు.
అచ్చంనాయుడు మీద ఫైర్..
ఎమ్మెల్యే రోజా అచ్చంనాయుడు మీద ఫైర్ అయ్యారు. సమర్ధవంతమైన పాలన అందించామని చెబుతున్న అచ్చం నాయుడు నాడు డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకు..నారాయణ కాలేజీల్లో విద్యార్ధలు ఆత్మహత్యలకు.. వనజాక్షి లాంటి అధికారిణి పైన దౌర్జన్యం చేసినందుకు..కాల్మనీ పేరుతో మహిళలను హింసించిందనందుకా మీకు మీరు సమర్దవంతమైన పాలనగా చెప్పుకుంటున్నారంటూ ప్రశ్నించారు. అచ్చంనాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. గత పాలనలో అధికారంలో ఉన్న వారు బలవంతుడిగా ఉంటూ బలహీనులను బెదిరించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ బహీనులకు బలవంతుడు అండగా నిలిచే సమయం వచ్చిందన్నారు. ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేద్ సాహసోపేత నిర్ణయంగా రోజా అభివర్ణించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తొలి హామీ సైతం అమలు చేయలేకపోయారంటూ సభలో రోజా ఎద్దేవా చేసారు.
రోజా విశ్వరూపం...
స్పీకర్గా తమ్మినేని సీతారాం ఎన్నికైన నాడు..ఈ రోజు సభలో రోజా ప్రసంగాలకు ఎక్కడా టీడీపీ నేతలు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయటం లేదు. గతంలో రోజా ప్రతిపక్షంలో ఉండగా..రోజాకు మైకు ఇవ్వకుండా..ఇచ్చినా రోజా ప్రసంగానికి అడ్డుపడుతూ ఉండేవారు. ఇక, ఇప్పుడు అధికార పక్ష సభ్యురాలిగా రోజా ప్రతీ సందర్భంలోనూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుంటున్నారు. నాటి ప్రభుత్వం..ప్రత్యేకించి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. పంచ్లు...ప్రాసలతో గత ప్రభుత్వ నిర్ణయాల పైన విరుచుకుపడుతున్నారు. ఇక, రానున్న రోజుల్లొ రోజాకు సభలో పూర్తి స్థాయిలో చర్చల్లొ పాల్గొనే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ నిర్ణయించింది. ఈ సమావేశాల ద్వారా రోజాతో పాటుగా అనేక మంది మంచి వాగ్దాటి ఉన్న వారు బటయకు వస్తున్నారు. వీరంతా రానున్న రోజుల్లో వైసీపీకి మౌత్ పీస్లుగా ఉండనున్నారు.