రాహుల్ అదే వీణ వాయించుకోవాలి...తెలుగు పప్పుకు తోడైన కాంగ్రెస్ పప్పు:వైసిపి ఎమ్మెల్యే రోజా
Recommended Video
చిత్తూరు:చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ ఇక బాబు ఇచ్చిన వీణనే వాయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైసీపీ పార్లమెంటు కార్యాలయం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన వైసిపి ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు. తెలుగు పప్పు లోకేష్కు కాంగ్రెస్ పప్పు రాహుల్ తోడయ్యారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జగన్ను గెలవకుండా చేయాలని చంద్రబాబు పవన్కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని రోజా దుయ్యబట్టారు.
ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్పై హత్యాయత్నం జరిగితే టిడిపి నేతలు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని రోజా ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. పలు కేసులున్న క్రిమినల్ ని ఎలా ఎయిర్పోర్టు రెస్టారెంట్లో పెట్టుకున్నారని...దాడి తర్వాత ప్రతిపక్ష నేత జగన్పై టిడిపి నేతలు ఎలా మాటల దాడి చేశారో ప్రజలు అందరూ చూశారని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తోందని...అలాగే జగన్ కు మహిళలు ఎంత ఆదరణ ఇస్తున్నారో పాదయాత్ర ద్వారా తెలుస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో వైసిపి నేతలు మరింత బాధ్యతగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. అనంతరం చిత్తూరులో అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైసిపి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగగా...ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కన్నా సొంత విషయాలపై సిఎం చంద్రబాబుకు శ్రద్ధ అని దుయ్యబట్టారు. జగన్ పై గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకరేమో 16 నెలలు జైల్లో పెట్టిస్తే, మరొకరు ఏకంగా చంపేదానికి ప్రయత్నం చేశారన్నారు. వాళ్లిద్దరు ఈ జిల్లా వాళ్లే కావడం ఇబ్బందికరంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.