బూతు పురాణం: సభలో వైసీపీ సభ్యుల తీరిది, వీడియో విడుదల చేసిన చీఫ్ విప్
హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు బుధవారం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే, స్పీకర్ అనుమతితో ఈ వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేస్తున్నామన్నారు. రోజాతో పాటు మరో నలుగురు సభ్యులూ స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతామని చెప్పారు.
చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్లో వైసీపీ సభ్యులు తీరు ఇలా ఉంది:
వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు చుట్టుముట్టారు. కొందరు కింద బైఠాయించారు. మరికొందరు నిల్చున్నారు. కాల్మనీ సీఎం, సెక్స్ రాకెట్ సీఎం, కామ సీఎం అంటూ రోజా అరుస్తుండగా ఇతర సభ్యులు ‘డౌన్ డౌన్' అంటూ పెద్దపెద్దగా అరిచారు. ఇంతలో కాగితాలను చించి ముక్కలు చేస్తూ రోజా గాలిలోకి విసిరారు.
ఒకవైపు నినాదాలు చేస్తూనే వైసీపీ సభ్యులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలు చేశారు. రాయలేని కొన్ని బూతులూ మాట్లాడారు. టీడీపీ మహిళా సభ్యురాలిని ఉద్దేశించి... ‘‘నేను ఆమెలాగా మొగుడ్ని కొట్టి పోలీస్ స్టేషనకు వెళ్లలేదు. నేనేమీ ఎవడితోపడితే వాడితో పడుకోలేదు'' అని రోజా అనడం స్పష్టంగా వినిపించింది.
‘ధైర్యంలేక మహిళను దించాడు. వాడేం మొగోడు' అంటూ చేతిని వెనక్కి చూపుతూ అన్నారు. రోజా ‘కామ సీఎం' అని నినదిస్తున్న సమయంలో పక్కనుంచి మరో సభ్యుడు ‘డాక్టర్ కామ సీఎం' (ఇటీవల చంద్రబాబుకు షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడాన్ని గుర్తు చేస్తూ) అని మరో పదం జోడించారు. ‘సెక్స్ రాకెట్లో బాబుకు డాక్టరేట్ ఇచ్చారు' అని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు.
‘మహిళల జీవితాలు సర్వనాశనం చేసిన టీడీపీ' అని కూడా రోజా నినాదాలు చేశారు. ఇంతలో కొడాలి నాని మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కుక్కలాగా మొరుగుతాడు సార్. సైకోగాడు సార్. వాడు అచ్చెన్నాయుడు వాడు సొల్లు సైకోగాడండి. వాడు ఎద్దులాగా పెరిగాడు. వాడికి బుద్ధి లేదు. వాళ్ల ముఖ్యమంత్రి సెక్స్ సెక్స్. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావును చంపిన వెధవలు వీళ్లు! వీళ్లా మాట్లాడేది సన్నాసులు'' అని తిట్టిపోశారు.
ఈ సమయంలో మరికొందరు అధికారపక్ష సభ్యులవైపు చేతులు చూపిస్తూ వాదించడం కనిపించింది. ఇక... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. ‘‘విజయవాడలో అందరూ భయపడుతున్నారు సార్. చంద్రబాబు పెద్ద దొంగ సార్. లోకేశ బాబు పెద్ద దొంగ సార్. చంద్రబాబు, అరడజను దొంగల్లాగా ఉన్నారు సార్'' అని అన్నారు. అచ్చెన్నాయుడును ఉద్దేశించి... ‘అచ్చా... లుచ్చా!' అని నినాదాలు చేశారు.
స్పీకర్ చేసిన సూచనలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిస్పందిస్తూ... ‘‘దానికి సీనియర్లు అక్కర్లా! ఎప్పుడు వచ్చాం కాదు.. కరెక్ట్గా దిగిందా లేదా అన్నది ముఖ్యం. గుర్తు పెట్టుకోండి'' అని అనడం వినిపించింది. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఇంతలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ... ‘‘ఏం చెప్పిండు! మండేనా (సోమవారమా)!' అంటూ ఒక బూతు పదం వాడారు.