లింగ వివక్ష నాకు అనుభవం..మహిళా సాధికారత మాటలకే పరిమితం : ఎమ్మెల్యే రోజా
నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మహిళా సాధికారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలు నేటికీ అణగదొక్కబడుతున్నారని రోజా అభిప్రాయపడ్డారు. పుత్తూరులో ఒక కళాశాలలో మహిళా సాధికారతపై రెండు రోజుల సెమినార్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా మహిళా సాధికారత మాటలకే పరిమితం అని , లింగ వివక్ష అన్నీ రంగాల్లో ఉందని వ్యాఖ్యానించారు.
ఇక తాను ఈ వివక్షను స్వయంగా అనుభవించానని రోజా చెప్పుకొచ్చారు . అయితే మహిళలు ఎదురయ్యే వివక్షను అధిగమించి ముందుకు వెళ్ళాలని రోజా సూచించారు. వివక్షను అధిగమించితే అభివృద్ధి సాధించినట్టే అని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
అసలు మన జీవితంలో లింగ వివక్ష ఇంట్లో తల్లిదండ్రుల నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఆడపిల్లలను ఒకలా, మగపిల్లలను ఒకలా చూసే వ్యవస్థ మారితే అప్పుడు సమాజంలో మార్పు వస్తుందని రోజా పేర్కొన్నారు. ఇళ్ళలో మొదలవుతున్న వివక్ష మారితే మిగతా అన్నింటా విజయమే అని రోజా చెప్పారు.
21వ శతాబ్దంలో ఉన్నామని గుర్తించుకుని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మహిళలు చరిత్ర సృష్టించాలని చెప్పారు ఎమ్మెల్యే రోజా .చదువులు, క్రీడలు, పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో వివక్షను అధిగమించినప్పుడే రాణించగలుగుతామన్నారు రోజా . ప్రతి ఒక్క మహిళ జీవితమనే పాఠ్యాంశాలను చదివి గమ్యం అనే పరీక్షలను రాసి ఉత్తీర్ణులు కావాలని మహిళలను కోరారు. ఇక ఎవరూ ఎవరికీ భయపడవద్దని , ఆ భగవంతుడికి, మనసాక్షికి మాత్రమే జవాబుదారీగా ముందుకు వెళ్లాలని రోజా సూచించారు.