ఏపీ ప్రతిపక్షాలకు ఆయుధాలిస్తున్న వైసీపీ నేతలు .. జగన్ కు తలనొప్పిగా ఎమ్మెల్యేలు,ఎంపీల వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇక వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి అధికారపార్టీ నానా తిప్పలు పడుతోంది. ఇదే సమయంలో సొంత పార్టీ నాయకుల నుండి వ్యక్తమవుతున్న అసంతృప్తి ఏపీ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే నిరసన గళం ఎత్తుతున్న తీరు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. అసలే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న సమయంలో,అధికార పార్టీ నేతల పైన, ప్రభుత్వ యంత్రాంగంపైన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్
వైసీపీ ఏడాది పాలన .. అధికార పార్టీ నేతల నిరసన గళం
ఏపీలో వైసీపీ పాలన సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏం చేయలేకపోయామని అధికార పార్టీ నేతలు కొందరు తీవ్ర అసహనంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ సమస్యలు పరిష్కరించ లేకపోయామని, అధికారులు ఎవరి మాట వినడం లేదని కొందరు, ఇసుక కొరత, తాగునీటికి ఇబ్బంది ఇతరత్రా సమస్యలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వారు కొందరు బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు బలమైన ఆయుధంగా మారింది.
ఇసుక కొరతపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీనియర్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుక కొరతపై తన నిరసనగళం వినిపించారు. ఏపీ లో ఇసుక విధానం అమలు చేయడంలో ఏపీఎండీసీ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సమస్యపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లోని సి ఆర్ సి లో ఇసుక తరలింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు .అధికార పార్టీ ఎమ్మెల్యేనైన నేనే చెప్తున్నా .. కోనసీమలోని తన నియోజకవర్గ పరిధిలో పది ఇసుక ర్యాంపులు ఉన్నా ఒక్కటి కూడా ప్రారంభించలేదని ఆయన మండిపడ్డారు.వసిష్ఠ గౌతమి, గోదావరి చుట్టూ ఇసుక ఉన్నా ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
దోసెడు ఇసుక దొరకటం లేదన్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
ఇక ఇప్పటికే ఇసుక విధానంపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా మండిపడ్డారు. రీచ్ నుంచి యార్డ్ కు వచ్చేటప్పటికే ఇసుక లారీ మాయమవుతోంది అని ఏ ఒక్క గ్రామంలోనూ దోసెడు ఇసుక కూడా ఇచ్చే పరిస్థితి లేదని కలెక్టర్లకు గనుల శాఖ అధికారులకు ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే ఇసుక విధానం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందే విమర్శలు గుప్పించారు.
ఆన్ లైన్ మాయాజాలం అన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఇక రాష్ట్రంలో ఇసుక దొరకని తీరు ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చగా వుంటుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ లో ఇసుక విక్రయాలు మోసమని, ఆన్లైన్ ఒక మాయాజాలం అని ఆయన పేర్కొన్నారు. 15 వేల రూపాయలు ఉండే ఐదు యూనిట్లు ఇసుక లారీని దళారులు 40,000 రూపాయలకు విక్రయిస్తున్నారని, దళారులు దగ్గర ఇసుక ఏ విధంగా వస్తుంది అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇసుక విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇంకా ఏపీ లోని ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి.
నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యం అని మాజీమంత్రి ఆనం వ్యాఖ్యలు
ఇక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు, నిలదీస్తున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, అభివృద్ధి శూన్యం గా మారిందని , అధికారుల తీరు అసహనానికి గురి చేస్తోందని మండిపడ్డారు. జలవనరుల శాఖ నీటినే అమ్ముకుంటున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు ప్రజల కోసం పోరాటానికి సిద్ధమంటూ ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
ఆనం బాటలో పలాస , కందుకూరు ఎమ్మెల్యేలు
ఒక్క ఆనం మాత్రమే కాదు, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు కూడా ప్రభుత్వ అభివృద్ధి పనులు చేయకపోతే జనం గుర్తించరంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పనులు అసలు ముందుకు కదలడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి సైతం జిల్లా అధికారులపై మండిపడ్డారు. తాగునీటి కోసం సీఎం జగన్ వంద కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అంటూ అధికారులను నిలదీశారు. తన నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందా లేదా అన్నిచోట్ల ఇలాగే ఉందా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇరకాటంలో జగన్ ప్రభుత్వం .. అలెర్ట్ అవుతుందా ?
ఇక సొంత పార్టీ నేతలే బాహాటంగా ఏపీ ప్రభుత్వ పాలనను, అధికారుల తీరును విమర్శిస్తున్న పరిస్థితి జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేస్తోంది. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న విధానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ ను తలపిస్తుందా అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాల్సిన అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలనివ్వడం జగన్ ప్రభుత్వానికి మింగుడుపడని అంశం. సొంత పార్టీ నేతలే నిరసన సెగ పెడుతున్న వేళ జగన్ సర్కార్ ఇకనైనా అప్రమత్తం అవుతుందా అనే వేచి చూడాలి .