కొడుకుతో చంద్రబాబుకు బాధలే.. బుద్దా వెంకన్నకు అది కూడా లేదు.. వైసీపీ ఎమ్మెల్యే మాటల తూటాలు
గుంటూరు : నేతల మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో టీడీపీ, వైసీపీ లీడర్లు ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం హాట్ టాపికవుతోంది. ఇదివరకు మైకుల ముందు విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడేమో అందివచ్చిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ట్విట్టర్ ప్లాట్ఫామ్పై నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరిని మించి మరొకరు ఆరోపణలు చేసుకుంటూ.. ఒక్కోసారి రాయలేని భాషలో కూడా నోరు పారేసుకుంటున్నారు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం
టీడీపీ, వైసీపీ నేతల మధ్య పరోక్ష యుద్దం నడుస్తోంది. మాటల తూటాలు పేల్చుతూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఆ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు లోకేశ్పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు విరుచుకుపడ్డ తీరు హాట్ టాపికైంది. సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన సుధాకర్ బాబు తండ్రీ కొడుకులను ఏకి పారేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం ఐతే.. చంద్రబాబు నాయుడు తన కొడుకును కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి కొడుకు జన్మించినందుకు చంద్రబాబు బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!
బుద్ది లేని బుద్దా వెంకన్న అంటూ ఫైర్
అదలావుంటే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ఓ రేంజ్లో ఫైరయ్యారు సుధాకర్ బాబు. బుద్ది లేని బుద్దా వెంకన్న అంటూ సంబోధించారు. జగన్ పాలన గురించి ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. అలాంటిది ఆయన కూడా మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుర్గ గుడిలో కొబ్బరి చిప్పల దొంగ బుద్దా వెంకన్న.. మీకు రాయడం, చదవడం వచ్చా అంటూ ఎద్దేవా చేశారు. అలాంటిది మీరు ట్విట్టర్లో ఎలా పోస్టులు పెడుతున్నారని ప్రశ్నించారు. అసలు ట్విట్టర్ అంటే ఏంటో తెలుసా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు టార్గెట్గా సుధాకర్ బాబు బాంబ్ పేల్చారుగా..!
ఇక చంద్రబాబు నాయుడు టార్గెట్గా మాటల తూటాలు పేల్చారు సుధాకర్ బాబు. ఒకవేళ చంద్రబాబు గంగానదిలో దిగితే అది కూడా కలుషితం అవుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని.. ఆ దెబ్బకు చంద్రబాబు నాయుడు దిమ్మ తిరుగుతోందని ఘాటుగా మాట్లాడారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి ప్రజాదరణ కార్యక్రమం ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. విద్యను అమ్ముకునే వాడిని ఆయన విద్యాశాఖ మంత్రిగా చేస్తే.. జగన్ మాత్రం విద్యకు పెద్దపీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదంతా చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
హుజుర్నగర్ బరి.. లెక్కలు సరి.. గెలుపెవరిది మరి..!
చంద్రబాబు గంగా నదిలో మునిగితే అది కూడా కాలుష్యమే..!
అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని చెప్పిన సుధాకర్ బాబు.. చంద్రబాబు నాయుడు తన పాపాలను కడుక్కోవడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని సూచించారు. ఆయన గంగా నదిలో దిగితే అది కూడా కలుషితం అయ్యేలా ఉందని వ్యాఖ్యానించారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు మాట తప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి లాభదాయకంగా మారి వేలాది కోట్ల రూపాయలు సేవ్ అవుతున్న విషయం చంద్రబాబుకు బోధపడటం లేదా అని విరుచుకుపడ్డారు. మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయిన నాటి నుంచి టీడీపీ పతనం మొదలైందని వ్యాఖ్యానించిన సుధాకర్ బాబు.. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ఏ పార్టీతో పెట్టుకుంటే ఆ పార్టీ కూడా పతనం అవుతోందని అన్నారు.