జగన్కు నారాయణ షాక్: టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే సునీల్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్కు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ షాకిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి నారాయణ తీవ్రంగా శ్రమించి ఫలితం సాధించారు.
సునీల్ను విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి నారాయణ వెంట తీసుకుని వచ్చారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరారు.
నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ మంగళవారం రాత్రి తెదేపా గూటికి చేరారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన తెదేపా కండువా కప్పుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు త్వరలోనే టిడిపిలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీలోకి మరింత మంది ఎమ్మెల్యేలు వస్తారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పిన విషయం తెలిసిందే.