నేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియో
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తను మనస్తాపానికి గురయ్యాడని ఆత్మహత్య చేసుకుంటానంటూ చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా జగన్ అపాయింట్మెంట్ కోసం వేచిచూసిన ఆయనకు వైసీపీ అధినేత నుంచి పిలుపురాలేదు. కొద్దిరోజుల క్రితం లోటస్ పాండ్కు వెళ్లి అక్కడే చాలాసేపు వేచిచూసి నిరాశతో వెనుదిరిగారు. ఇక అసలు విషయానికొస్తే... జగన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చిన సునీల్... తనను నమ్మి ఒక డాక్టరుగా గౌరవించి తొలిసారి పూతలపట్టు టికెట్ కేటాయించారని చెప్పారు. ప్రతిరోజు పత్రికల్లో జగన్ ఫోటో చూడనిదే తనకు రోజు గడవదని సునీల్ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
తను టీడీపీలోకి వెళుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తనను ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ఆపార్టీ వైపు చూడలేదని చెప్పారు. అయితే గత కొన్ని రోజులుగా పలు వార్త పత్రికల్లో తాను టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రచారం జరిగిందని... కొందరు సీనియర్ నాయకులు కూడా సునీల్ పార్టీ మారుతున్నారని చెప్పడం తనను ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. టికెట్ పై తనకు స్పష్టత లేకపోయినప్పటికీ తన నియోజకవర్గాల ప్రజలు మాత్రం తనపై నమ్మకం ఉంచారని చెప్పారు. అయితే టీడీపీలో చేరుతున్నాడు కాబట్టే జగన్ తనను దూరం పెట్టినట్లు సీనియర్ నేతలు ప్రచారం చేయడం తనను ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. టికెట్ లేకపోయినప్పటికీ ఫర్వాలేదు కానీ జగన్ తనను దూరం పెట్టడాన్ని సహించలేకపోతున్నట్లు చెప్పారు.
జమ్మలమడుగు వెళ్లటమే ఆయన చేసిన పాపం : నాన్న మరణం పైనా : జగన్ సంచలన ఆరోపణలు..!
కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కానీ... సీనియర్ నాయకులు చేసే ప్రచారాన్ని ఆ నిందను తాను భరించలేకపోతున్నట్లు సునీల్ చెప్పారు. అందుకే తాను చనిపోవాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. చనిపోయే ముందు నిజం తెలియాలనే ఈ వీడియో రికార్డు చేసి పంపిస్తున్నట్లు చెప్పారు. తను ఒక డాక్టర్ అని చెప్పిన సునీల్ తనకు ఆర్థిక ఇబ్బందులు లేవని తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. తను ఎప్పటికీ జగన్ మనిషినే అని చెప్పుకున్న సునీల్... తాను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు.
తన మనసు కుంగిపోయిందని గత పదిరోజులుగా కన్నీళ్లతో ఆవేదన చెందినట్లు చెప్పారు. జగన్ను తాను ఎంతో గానో ప్రేమించానని అలాంటి వ్యక్తి నమ్మకాన్ని చూరగొనలేకపోయాననే బాధను వ్యక్తం చేశారు సునీల్. తన చావుతో జగన్ బాధపడకూడదని చెప్పిన సునీల్ ... జగన్ ఒక మంచి మేధావని ప్రతిఒక్కరినీ ఆయన ప్రేమిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని దళితులు, తన నియోజకవర్గ ప్రజలు కూడా జగన్ను ముఖ్యమంత్రి చేయాలని సునీల్ చెప్పారు. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నా తనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ చెప్పి సునీల్ సెల్ఫీ వీడియోను ముగించారు.