వైసిపి ఎమ్మెల్యే కి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
అనంతపురం:అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ కు తరలించారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ముందుగా ఆయనను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని తీసుకొని హైదరాబాద్కు తరలించారు. కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల నుంచి ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి టిడిపి అభ్యర్థిపై మూడు సార్లు పోటీ పడగా 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు.
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 2004 ఎన్నికల్లో సిపిఐ(ఎంఎల్) పార్టీ తరుపున విశ్వేశ్వరరెడ్డి బరిలోకి దిగగా...ఆ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మళ్లీ 2009 ఎన్నికల్లో అదే పయ్యావుల కేశవ్ పై కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగిన విశ్వేశ్వర రెడ్డి కేవలం 229 ఓట్ల తేడాతో ఒటమి పాలయ్యారు.
ఇక 2014 ఎన్నికల్లో వైసిపి తరుపున బరిలోకి దిగిన విశ్వేశ్వర రెడ్డి ముచ్చటగా మూడోసారి మాత్రం తన సమీప ప్రత్యర్థి, అప్పటి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డికి 81042 ఓట్లు రాగా పయ్యావుల కేశవ్ కు 78767 ఓట్లు లభించాయి. అయితే 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు వైసిపి ఎమ్మెల్యేలు అధికార పార్టీ టిడిపిలోకి ఫిరాయించినా...విశ్వేశ్వర రెడ్డి మాత్రం వైఎస్ జగన్ కు విధేయుడిగానే ఉండిపోయారు.