జగన్ కు అక్కడే చంద్రబాబు చిక్కారు..!! సీఎంకు కావాల్సింది అదే : అమరావతి కధలో కొత్త ట్విస్ట్..!!
Recommended Video
ముఖ్యమంత్రి జగన్ రాజధాని రగడ పైన నోరు విప్పటం లేదు. మంత్రులు రాజధాని తరలింపు ఉండదని ధీమాగా చెబుతున్నారు. కానీ, అనుమానాలు మాత్రం వీడటం లేదు. ఇప్పటికే రాజధానిగా అమరావతిని మార్చవద్దంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. బీజేపీ నేతలు పర్యటించారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అమరాతిలో పర్యటన కోసం రానన్నారు. పలువురు మంత్రులు రాజధాని తరలింపు గురించి ఆలోచన లేదని చెబుతున్నా..రాజకీయంగా మాత్రం ప్రతిపక్ష పార్టీలు బొత్సా వ్యాఖ్యల పైనే ఫోకస్ చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజధానిలో అక్రమాల గురించి మంత్రులు గట్టిగా ప్రస్తావిస్తున్నారు. జాతీయ నేతలు అదే డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా జగన్ కు కావాల్సింది అదే. అక్కడే చంద్రబాబు రాజకీయంగా చిక్కుకున్నారు. దీంతో..జగన్ కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు... రాజధాని కధ కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది...
అక్టోబర్ 2 నుంచి ఆరు రకాల ప్లాస్టిక్ వస్తువుల బ్యాన్.. విక్రయం, ఉత్పత్తి కూడా నిషేధమే...
జగన్ కు కావాల్సిందే..డిమాండ్ గా మారింది...
తొలి నుండి రాజధాని లో భారీ స్కాం జరిగిందని..దీని పైన విచారణ అవసరమని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రధాని..అమిత్ షా తో కలిసిన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అమరావతి అతి పెద్ద స్కాంగా జగన్ అభివర్ణించారు. ఇక, రాజధాని విషయంలో జగన్ ఎప్పుడూ వ్యతిరేకంగా.. అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో బొత్సా రాజధాని పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ముంపు ప్రాంతమని చెబుతూనే..ప్రధానంగా అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని హైలైట్ చేసారు. బీజేపీ రాష్ట్ర నేతలతో పాటుగా జాతీయ నేతలు సైతం దీని పైన విచారణ చేయండి కానీ.. రాజధాని మార్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. వామపక్ష నేతలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తప్పు జరిగితే చర్యలు తీసుకోవచ్చు కానీ..రాజధాని తరలింపు ఆలోచన సరికాదని వ్యాఖ్యానించారు. ఇదే జగన్ కోరుకుంటుంది. రాజధాని మీద ఏకపక్షంగా విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. అందుకు అవకాశం లేకుండా అన్ని పార్టీల డిమాండ్ గా దీనికి తీసుకురాగలిగితే..విచారణకు ఆదేశించాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. సరిగ్గా తాను ఏది కోరుకున్నారో..అదే అన్ని పార్టీల నుండి డిమాండ్ గా వస్తుండటంతో ఇప్పుడు జగన్ అమరావతి భూముల పైన విచారణ దిశగా అడుగులు వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కారా..
ఇక..ముఖ్యమంత్రి జగన్ కు కావాల్సింది రాజకీయంగా చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందటం. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా బలం పుంజుకోకుండా చేయటం. ఇక..రాజధాని మీద బొత్సా వ్యాఖ్యల తరువాత చంద్రబాబు అమరావతికి పూర్తిగా అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వంలోని మంత్రులు ఇతర ప్రాంతాల డెవలప్ మెంట్..డీసెంట్రలైజేషన్ గురించి పదే పదే చెబుతుంటే దాని పైన చంద్రబాబు సానుకూలంగా ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. రాజధాని పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మంత్రి బొత్సా సైతం అన్ని ప్రాంతాలను డెవలప్ చేయటమే తమ లక్ష్యం అని చెబుతున్నా..టీడీపీ నేతలు ఆ వాదనకు ఎక్కడా మద్దతిస్తూ మాట్లాడలేదు. నేతలంతా అమరావతి రాజధానిగా కొనసాగించాలనే నినాదం మీదే నిలబడ్డారు. ఏపీలోని ఇతర ప్రాంతాల గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్లో తాము రాజకీయంగా ఏం కోరుకుంటున్నామో అర్దం అయ్యేలా వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పదే పదే అమరావతి ఒక్క దాని గురించే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. తాము ఏపీలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తుంటే..చంద్రబాబు కేవలం అమరావతి గురించే ఆలోచన చేస్తున్నారని చెప్పటం ద్వారా రాయలసీమ..ఉత్తరాంధ్రలో రాజకీయంగా మైలేజ్ సాధించటానికి వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది.
రాజధాని పైన కీలక నిర్ణయం దిశగా జగన్..
రాజధాని అమరావతి పైన ఇంత రాద్దాతం జరుగుతున్న టీడీపీలో కొందరు మినహా ముఖ్య నేతలు బయటకు రావటం లేదు. ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ లాంటి వారికి రాజధానిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలు రాజధానిలో భూముల కోసం సొంతంగా..బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారనేది వైసీపీ వాదన. దీంతో..రాజధానిలో అక్రమాలు జరిగానే ఆరోపణలతో అమరావతి భూముల వ్యవహారం మీద విచారణ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రైతలు మీద ఎఫెక్ట్ పడకుండా..వారికి కౌలు చెల్లిస్తూనే.. ఇతర ప్రాంతాల్లో డెవలప్ మెంట్ చేస్తూ.. విచారణ పూర్తి చేయాలనేది ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తోంది. అమరావతి అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా ఉంచుతూ..అధికార వికేంద్రీకరణ కు ఏ పార్టీ వ్యతిరేకించే అవకాశం లేదు. ఒక్క టీడీపీ నేతలు మాత్రం నష్ట పోయే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..అమరావతి లో కొత్త ట్విస్ట్ ఇవ్వటానికి ముఖ్యమంత్రి జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.