మండలి రద్దు ఆగాలంటే: టీడీపీలో చీలిక వస్తేనే..ఛైర్మన్ మారాలి: వైసీపీ తాజా వ్యూహం ఇదేనా..!
ఏపీలో శాసనమండలి రద్దు ఖాయమా. చివరి నిమిషంలో ప్రభుత్వ ఆలోచనలో మార్పు వస్తుందా. వైసీపీలో ఏం జరుగుతోంది. సీఎం ఆలోచనలు ఏంటి. సోమవారం మండలి రద్దు పైన తుది నిర్ణయం తీసుకుం దామంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశం సైతం ఏర్పాటు చేసారు. దీంతో..ఏం జరిగే అవకాశం ఉందనే ఉత్కంఠ కనపిస్తోంది. ఇక..సిట్టింగ్ ఎమ్మెల్సీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కొందరు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే, టీడీపీ మాత్రం తమ సభ్యులను అధికార పార్టీ ప్రలోభ పెడుతుందని ఆరోపిస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచార జోరుగా సాగుతోంది. వైపీపీ నేతల వ్యూహం గమనిస్తే..మండలి రద్దు పైన చివరి నిమిషం వరకు ఖాయమనే ప్రచారం సాగిస్తూ.. తమ పని పూర్తి చేసుకో వాలని భావిస్తున్నారు. మండలి ఆగాలంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ చీలిక..మండలి ఛైర్మన్ మార్పు జరిగితేనే అని వైసీపీ నేతలు ఓపెన్ గా చెప్పుకున్నా..అదే వ్యూహంగా స్పష్టమవుతోంది.
టీడీపీలో చీలిక వస్తేనే..!
మండలిలో ప్రస్తుతం టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ఇంకా కొనసాగించ కూడదని అధికార పార్టీ గట్టి పట్టదలతో కనిపిస్తోంది. కీలకమైన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం ద్వారా..ప్రభుత్వం మండలి లో టీడీపీ తీరును చాలా సీరియస్ గా తీసుకుంది. మండలి రద్దు దిశగా అడుగులు వేసి..పరిస్థితిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొనే వ్యూహం అమలు చేస్తోంది. మండలి రద్దు ఖాయమని చెబుతూనే..మరి కొందరు మధ్య వర్తులు అటు అధికార పార్టీ నుండి సందేశాలు తెస్తున్నారు. టీడీపీ మెజార్టీ కొనసాగటానికి వీళ్లేదని..ఇదే సమయంలో టీడీపీలో చీలక వచ్చి..ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరకున్నా..ప్రత్యేక గ్రూపుగా సభ లో గుర్తింపు పొందేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూపు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా సభలో టీడీపీ మెజార్టీకి గండి కొట్టటంతో పాటుగా తాము అనుకున్న విధంగా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన బిల్లుల పైన మరో వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది.
ఛైర్మన్ మారాల్సిందేనా..
అధికార పార్టీ వైకాపా ఒక పక్క శాసన మండలిని రద్దు చేయనున్నామన్న సంకేతాలిస్తూనే... మరో పక్క మండలిలో బలం పెంచుకునేందుకు వీలుగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రయత్నాలు ఫలించి మండలిలో మెజారిటీ వస్తే రద్దు ఆలోచనను విరమించుకునే అవకాశం ఉంది. బలం పెరిగిన తర్వాత ప్రస్తుత ఛైర్మన్ను అవిశ్వాస తీర్మానంతో తొలగించి వైకాపా సభ్యుడిని ఛైర్మన్గా చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం సెలక్టు కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఉపసంహరించుకుని వాటికి చిన్న చిన్న మార్పులతో ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందాలన్నది వైకాపా ఆలోచనగా కనపడుతోంది. అయితే, సోమవారం ఉదయం వరకు చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా ప్రభుత్వం మండలి రద్దు పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
లీగల్ చిక్కులపైన కసరత్తు..
మండలి రద్దు..సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు..రాజధాని మార్పు విషయంలో హైకోర్టు తాజా మార్గదర్శకాల పైన ముఖ్యమంత్రి జగన్ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్తో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటికీ పంపిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో స్పష్టం చేసారు. దీనికి కోర్టు రికార్డు చేసింది. అదే విధంగా తమకు సమాచారం లేకుండా కార్యాలయాల తరలింపు ప్రారంభిస్తే ప్రభుత్వం నుండి ఆ ఖర్చును వసూలు చేయటంతో పాటుగా.. బాధ్యులను చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో తీర్మానానికి ఉన్న అవకాశాల పైనా చర్చ జరిగినట్లు సమాచారం. హైకోర్టులో కేసు..మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం తో తీర్మానం చేసినా..నిలుస్తుందా..న్యాయ పరంగా చిక్కులు ఏర్పడుతాయా అనే కోణంలో వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో..సోమవారం ఉదయం జరిగే కేబినెట్ సమావేశంలోనే ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.