జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటున్న వైసీపీ ఎంపీ .. ప్రతిపక్షాలు రచ్చ చేసిన ఆ విషయంలోనే
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే , ఏపీలో కొనసాగుతోంది ప్రజానుకూల పాలన, యువ నాయకుడు నేతృత్వంలో ఏపీ ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నేత అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ పనితీరుకు తెగ కితాబిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పాలనను దుమ్మెత్తిపోస్తున్నారు.
చంద్రబాబు ... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా.. నీరు, మట్టి తప్ప : విజయసాయి సెటైర్
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే నిర్ణయంపై ఏపీలో ప్రతిపక్షాల రచ్చ
రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెద్ద రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మీటర్లు బిగించడాన్ని తప్పు పడ్డాయి. రైతుల పై పెనుభారం పడబోతుంది అంటూ ప్రచారం చేశాయి. ఆ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉచిత విద్యుత్ విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది.
ఉచిత విద్యుత్ నగదు బదిలీ విషయంలో వైసీపీ ఎంపీ ట్వీట్
తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ గారు చెప్పారంటే చేస్తారంతే అంటూ ఉచిత విద్యుత్ పైలెట్ ప్రాజెక్టు గురించి ట్వీట్ చేసారు . ఉచిత విద్యుత్ పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసి అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 30 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్న నేపద్యంలో వాటికి మీటర్లు బిగించి ,వారందరికీ నగదు బదిలీ చేయడానికి కావలసిన బ్యాంకు అకౌంట్లను తెరిపించి ఈ స్కీమ్ ను అమలు చేయాలని సర్కార్ భావించింది.
ఉచిత విద్యుత్ పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాకు 6.05 కోట్లు మంజూరు
అందులో భాగంగానే ఉచిత విద్యుత్ పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాకు 6.05 కోట్లు మంజూరు చేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరనున్నాయని ఆయన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ పై వ్యయం 4 వేల కోట్లు... అయినా కేటాయించేవాడు కాదు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 8,853 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది అంటూ జగన్ గారు చెప్పారంటే చేస్తారంతే అంటూ ట్వీట్ చేశారు.
యువనాయకుడు నేతృత్వంలో ప్రజానుకూల ప్రభుత్వం అంటూ కితాబు
అంతకుముందు 30 లక్షల ల్యాండ్ పట్టాలు ,28.3 లక్షల ఇళ్ల నిర్మాణం , సమగ్ర భూ సర్వే, కురుపాం లోని జె.ఎన్.టి.యు కోసం 105 ఎకరాల భూసేకరణ, 2.49 లక్షల పశువుల పంపిణీ, మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటు అన్నిటికీ ఏపీ కేబినెట్ లైన్ క్లియర్ చేసింది అంటూ పేర్కొన్న ఎంపీ విజయసాయిరెడ్డి యువ నాయకుడు నేతృత్వంలో ప్రజానుకూల ప్రభుత్వం ఇది అంటూ ట్వీట్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతుందని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పని నేత అని పదేపదే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చెబుతూనే, చంద్రబాబు పాలనలో చెయ్యని పనులపై, అవినీతి అక్రమాలపై విరుచుకు పడుతున్నారు.