సీఎం జగన్ కు సొంత ఎంపీ టెన్షన్ :కేవీపీ నివాసంలో 300మందికి విందు:ఢిల్లీలో సాయిరెడ్డిని మించిపోయేలా..
సొంత పార్టీ ఎంపీ వ్యవహార శైలి ముఖ్యమంత్రి జగన్ కు అంతు చిక్కటం లేదు. వైసీపీ ఎంపీగా ఉంటూనే..బీజేపీతో సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలు చేసినా.. తన రూటే సపరేటు అంటన్నారు. నేరుగా ఆ ఎంపీని ప్రధాని పేరు పెట్టి పిలిచి మరీ..పలకరించటంతో ఆయన ఇప్పుడు పాపులర్ ఎంపీ అయిపోయారు. వైసీపీ నేతలు సైతం ఆయన గురించి ఆచితూచి స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు అదే ఎంపీ ఏకంగా పార్లమెంట్ లోని అన్ని పార్టీల ఎంపీలకు విందు ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. అయితే, ఆయన ఖరారు చేసిన వేదిక సైతం ఇప్పుడు చర్చకు కారణమైంది. మరి..ఈ విందుకు ఆ ఎంపీ ఏపీ సీఎం..తమ పార్టీ అధినేత జగన్ ను ఆహ్వానిస్తారా. కేవీపీ నివాసంలో జరిగే కార్యక్రమానికి జగన్ హాజరవుతారా..ఇంతకీ అసలు ఈ విందు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు.. ఆ ఎంపీ లక్ష్యం ఏంటి..
అంతుబట్టని ఎంపీ రఘురామరాజు వైఖరి..
వైసీపీ ఎంపీ రఘురామ రాజు వైఖరి వైసీపీ నేతలకే కాదు..ముఖ్యమంత్రి జగన్ కు అంతుబట్టటం లేదు. ఎంపీగా గెలిచిన సమయం నుండి పార్టీకి విధేయుడిగానే ఉన్నా..బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు దీని పైన ఫిర్యాదులు రావటంతో...సీఎం నేరుగా ఈ అంశం మీద స్పందించిన ఎంపీలు ప్రధానిని లేదా కేంద్ర మంత్రులను కలిసే సమయంలో ఖచ్చితంగా సాయిరెడ్డి లేదా మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాలని సూచించారు. ఇక, ఆ తరువాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నేరుగా ప్రధాని..స్వయంగా రఘురామరాజును పలకరించటంతో..ఇక ఆ ఎంపీ క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరువాత అమరావతి వచ్చి సీఎం ను కలిసి జరిగింది చెప్పారు. అప్పటి నుండి బీజేపీతో నిరంతరం ఏదో కారణంతో సఖ్యత కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన పార్లమెంట్ లోని 300 మంది ఎంపీలకు ఒక విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.
కేవీపీ నివాసంలో విందు..జగన్ కు ఇరకాటం
సబార్డినేట్స్ కమిటీ ఛైర్మన్ హోదాలో రఘురామరాజు ఈ నెల 11న ఢిల్లీలో ఎంపీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని..అమిత్ షా నుసైతం ఆహ్వానించారు. అయితే, ఈ విందును తన వియ్యంకుడు కాంగ్రెస్ నేత..వైయస్సార్ ఆత్మగా పిలుచుకొనే కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఏర్పాటు చేసారు. ఆంధ్రా రుచులతో పాటుగా సీఫుడ్ ను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఈ విందుకు దాదాపు అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎం జగన్ ను ఇప్పుడు ఎంపీ ఆహ్వానిస్తారా లేదా అనే చర్చ వైసీపీలో మొదలైంది. అయితే, తన తండ్రి మరణం తరువాత సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయం నుండి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం జగన్ మాత్రం కెవీపీ రామచంద్రరావుతో దూరంగానే ఉంటున్నారు. ఆయన సైతం తన మిత్రుడు కుమారుడు సీఎం అవ్వటం పైన ఒక సందర్భంలో సంతోషం వ్యక్తం చేసారు. కానీ, ఈ ఆరు నెలల కాలంలో కలుసుకున్న సందర్భాలు లేవు. కెవిపి..రఘురామరాజుకు వియ్యంకుడు అవుతారు. ఢిల్లీలో తనకు నివాసం కేటాయించకపోవటంతో కేవీపి నివాసంలో ఈ విందు ఏర్పాటు చేసారు.
సాయిరెడ్డిని మించిపోయేలా లాబీయింగ్..
ఢిల్లీలో వైసీపీకి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పెద్ది దిక్కుగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ..బీజేపీ అదే విధంగా కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏపీ ప్రత్యేక ప్రతినిధి హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, రఘురామ రాజుకు గతంలో బీజేపీ ముఖ్యులతో ఉన్న సంబంధాలు ఇప్పుడు సాయిరెడ్డిని డామినేట్ చేసేలా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండే ఆయనతో సన్నిహిత సంబంధాలను ఇప్పుడు రఘురామరాజు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. దీని ద్వారా ఒక రకంగా పార్లమెంట్ లో బీజేపీ నేతలతో సాయిరెడ్డి కంటే రఘురామరాజు చాలా దగ్గరగా కనిపిస్తున్నారనే చర్చ వైసీపీ ఎంపీల మధ్యే జరుగుతోంది. ఇక..రఘురామ రాజును బీజేపీకి అంత దగ్గరగా ఉండవద్దని చెప్పలేక.. ఇటు పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పార్టీలో కొత్త చర్చకు కారణమవుతున్నారు. ఇక, రఘురామ రాజు విషయంలో సీఎం జగన్ ఏ రకంగా వ్యవహరిస్తారేది ఆసక్తి కరంగా మారుతోంది.