రఘురామకే అన్ని చిక్కులు .. అలా కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్ లో ఉన్నట్టా అన్న ఎంపీ
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీలో అందరికీ టార్గెట్ గా మారారు. తమకు తెలియకుండా కొంతమంది లోక్సభ సభ్యులు నేరుగా ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేతలు నేరుగా జగన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం క్యాంప్ ఆఫీస్లో జరిగిన పార్లమెంటరీపార్టీ సమావేశంలో పేర్లను వెల్లడించకుండా కొంతమంది ఎంపీలు.. ప్రధాని, కేంద్రమంత్రుల వద్దకు వెళ్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని జగన్ స్పష్టం చేశారు. ఇక ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రఘురామ కృష్ణం రాజే ఫోకస్ గా మారారు .ఈ క్రమంలో రఘురామ కృష్ణం రాజు మరోమారు స్పందించారు.
డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!
మొన్న ఇంగ్లీష్ మీడియం, నేడు బీజేపీ కి టచ్ లో ... రఘురామ వరుస వివాదాలు
ఇటీవల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలోనూ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో సీఎం జగన్ రఘురామ కృష్ణంరాజు మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరూ విజయసాయిరెడ్డి లేకుండా బిజెపి మంత్రులను, నేతలను కలవడానికి వీలు లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గానే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యం లోనే వైసీపీ ఎంపీలు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీలో సుజనా వ్యాఖ్యల చిచ్చు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుజనా చౌదరి వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీలో పలకరింపు ప్రకంపనలు రేపింది. ఇప్పటికే వైసీపీ నేతలు తమకు టచ్లో ఉన్నారని సుజన చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి కి టచ్ లో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతే కాదు సుజనా చౌదరి బీజేపీలో చేరిన ప్పటికీ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని, సుజనా చౌదరి కాల్ డేటా రికార్డు బయటపడితే అసలు వ్యవహారం బయటపడుతుందని పేర్కొన్నారు వైసీపీ ఎంపీలు.
నియోజక వర్గ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే టచ్ లో ఉన్నట్టా ? అని రఘురామ ప్రశ్న
తాజాగా బిజెపి ఎంపీల తో టచ్ లో ఉంటుంది రఘురామ కృష్ణంరాజు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సుజనా చౌదరి వ్యాఖ్యలపై స్పందించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కలిస్తే బిజెపితో టచ్ లో ఉన్నట్టా అని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి స్పందించారు.
ఎవరు బీజేపీ కి టచ్ లో ఉన్నారో చెప్పాలని సుజనా చౌదరిని డిమాండ్ చేసిన ఎంపీ
మా పార్టీ ఎంపీలెవరూ కూడా బీజేపీతో టచ్ లో లేరని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడితే సుజనా చౌదరే వైసీపీలోకి వచ్చే అవకాశముందన్నారు. తనతో టచ్ లో ఉన్న వైసీపీ నేతలెవరో సుజనా చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. సుజనా చౌదరి చెప్పేవన్నీ అబద్ధాలని పేర్కొన్న నరసాపురం ఎంపీ రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు జగన్ పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు.