వైసిపి ఎంపీల రాజీనామా వ్యవహారం:ఉప ఎన్నికలు జరుగుతాయా...లేదా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఓ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అది వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామాల వ్యవహారం. ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా వైసిపి లోక్ సభ ఎంపీలు చేసిన ఈ రాజీనామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందవని, కేవలం పొలిటికల్ మైలేజీ కోసమే వైకాపా ఈ నిర్ణయం తీసుకుందని ప్రత్యర్థులు ఆరోపించిన సంగతి తెలిసిందే.
Recommended Video
అయితే లోక్ సభ స్పీకర్ నుంచి అందిన నోటీసులు ఒక్కసారిగా అందరి అంచనాలు తలకిందులు చేశాయి...ఒకరకంగా చెప్పాలంటే వైసిపి పార్టీతో సహా అందరూ లోక్ సభ స్పీకర్ ఈ అనూహ్య పిలుపుకు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది...స్పీకర్ పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీన స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కలవనున్నారు.అయితే ఈ తరుణంలో ఒక అంశంపై ఉత్కంఠ నెలకొంటోంది...అది...వైసిపి ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా?...లేదా?...అనే!
రాజీనామాలు...ఆమోదిస్తారా?
ముందుగా అసలు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా?...లేదా అంటే...కొన్ని తాజా పరిణామాలను బట్టి ఆమోదించవచ్చనే తెలుస్తోంది...కర్ణాటక తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ నుంచి ఎంపీలుగా కొనసాగుతున్న యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయగా ఆ రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఈ సందర్భంలో సహజంగానే వైసీపీ ఎంపీల రాజీనామాల విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు...ఆమోదం తప్పనిసరి
కర్ణాటక ఎంపీల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లలోనే రాజీనామాలు సమర్పించినా ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే స్పీకర్ వైసిపి ఎంపీల రాజీనామాలను తొలుత భావోద్వేగపు రాజీనామాలుగా పరిగణించారని అంటున్నారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్ తో చేసిన రాజీనామా కాబట్టి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం కాబట్టి...దీనిపై వెనువెంటనే నిర్ణయం తీసుకొని వేటు వేయడం సమంజసం కాదని స్పీకర్ భావించారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. అయితే ఇంతకాలం గడిచాక వైసిపి ఎంపీలు తమ రాజీనామాలు వెనక్కి తీసుకోని పరిస్థితుల్లో...కర్ణాటక ఎంపీల రాజీనామాలను ఆమోదించిన నేపథ్యంలో ఇప్పుడు వైసిపి ఎంపీల రాజీనామాలపైనిర్ణయం తీసుకోక తప్పదని స్పీకర్ భావిస్తున్నారట. అందుకే తనను కలవాలని నోటీసులు పంపిన స్పీకర్ ఈ నెల 29వ తేదీన వైసిపి ఎంపీలతో మాట్లాడి వారు రాజీనామాలకే కట్టుబడి ఉంటే స్పీకర్ ఆమోదించడం ఖాయమని తెలుస్తోంది.
ఉప ఎన్నికలు...వస్తాయా?...
ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపి ఎంపీలు తమ రాజీనామాలు వెనక్కి తీసుకునే అవకాశం లేనందున వారి రాజీనామాలు ఆమోదం పొందడం ఖాయమనే భావించవచ్చు. మరి వైసిపి ఎంపీల రాజీనామాలతో ఆయా పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో స్పీకర్ వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు రావని...అందుకు సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపు జరగాల్సి ఉండటమే కారణమంటున్నారు. ఎంపీ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాలనే నిబంధన ఉన్నా సార్వత్రిక ఎన్నికలు సంవత్సరం లోపు ఉంటే ఇక ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించరని విశ్లేషిస్తున్నారు.
వస్తాయనే...మరికొందరు
అయితే మరికొందరు రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అందుకు నిదర్శనంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను కూడా ఉదహరిస్తున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన టిడిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ వైసిపి ఎంపీల రాజీనామాలను జూన్ 2వ తేదీ తర్వాత ఆమోదించే అవకాశం ఉదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓసారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే టీడీపీ ఏడు స్థానాలు గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. వైసిపి, బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఉప ఎన్నికలు రావని అది రాజకీయ లబ్ది కోసం వైసిపి స్టంట్ గా అభివర్ణించిన చంద్రబాబే...ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయాల్లో సీనియర్...కేంద్రంలో పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఆయనకు ఈ విషయంపై అవగాహన ఉండే మాట్లాడిఉండవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషించేరు.
వస్తే...ఏమవుతుంది
వైసిపి వైపు నుంచి చూస్తే ఆ పార్టీ ఉప ఎన్నికలు రాకూడదనే కోరుకుంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కారణం...ఈ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా పరిగణించడం తధ్యం కావడంతో టిడిపి నంద్యాల ఉప ఎన్నిక టైపులో అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించే అవకాశం ఉండటం, కారణాలేమైనా ఫలితాల్లో తేడా వస్తే సార్వత్రిక ఎన్నికల ముందే వైసిపికి ఈ ఫలితాలు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అయితే టిడిపి కి కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమే అయినా అధికార పార్టీగా కొన్ని అడ్వాంటేజ్ లు తీసుకునే అవకాశం ఉండటంతో అనివార్య పరిస్థితుల్లో భీభత్స పోరుకు సై అంటుంది. అయితే ఉప ఎన్నికలు వచ్చినా తమకు ఇబ్బందేమీ లేదని ఇప్పటికే టిడిపి అధినేత స్పష్టం చేసిన నేపథ్యంలో...వైసిపి కూడా అందుకు ధీటుగానే స్పందిస్తోంది. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్దమేనని అందుకు సిద్దపడే రాజీనామాలు చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఉప ఎన్నికలు...ఎక్కడెక్కడంటే?
వైసీపీ నేతలు రాజీనామా చేసిన లోక్ సభ స్థానాలు ఏవంటే...కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు...ఒకవేళ స్పీకర్ రాజీనామాలు ఆమోదించాక...ఉప ఎన్నికలు జరిపేందుకు నిర్ణయం తీసుకుంటే ఈ స్థానాలకే అవి జరుగుతాయి. వైసిపి వైపు నుంచి చూస్తే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో పాదయాత్ర ను పూర్తి చేసినందున అది తమకు కలిసొచ్చే అవకాశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పైగా ఈ నియోజకవర్గాల్లో జగన్ ప్రజాసంకల్ప యాత్రకు మంచి స్పందన లభించిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా తమ ఎంపీలు రాజీనామా చేసింది ప్రత్యేక హోదా కోసం కాబట్టి ఏపీ ప్రజలు కూడా తమని ఆదరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందుగా ఈ నెల 29వ తేదీ న ఏం జరుగుతుందనే విషయంపై అధికార,ప్రతిపక్ష పార్టీలతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నాయి.