బీజేపీ ఎంపీని వెనకేసుకొచ్చిన వైసీపీ ఎంపీ: టీడీపీ చెప్పింది నిజమైందా?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల రగడ ఇంకా ఏపీలో పెను దుమారం రేపుతూనే ఉంది. ఇక ఏపీలో రాజకీయ సమీకరణాలు కూడా ఊహించని విధంగా మారుతున్నాయి .తాజాగా వైసీపీ ఎంపీ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ ను వెనకేసుకొచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి
ఇటీవల కేంద్రం ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన నేపధ్యంలో బీజేపీ ఎంపీ ఏపీలో రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని , ఇందులో కేంద్రం జోక్యం చేసుకునేది లేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు రాజధాని విషయంలో టీడీపీ కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేసుకోవటంపై జీవీఎల్ మండిపడ్డారు. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు సైతం జీవీఎల్ మీద నిప్పులు చెరిగారు. ఆయన వైసీపీ ఏజెంట్ అని మండిపడ్డారు. ఇక ఆ వ్యాఖ్యలకు తగ్గట్టే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీవీఎల్ నరసింహారావును వెనకేసుకొచ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి.
జీవీఎల్ వైసీపీ ఏజెంట్ అని ఆరోపణలు చేసిన టీడీపీ
జీవీఎల్కు వైఎస్సార్సీపీతో సత్సంబంధాలు ఉన్నాయని టీడీపీ ఆరోపించినట్టే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా టీడీపీ మాత్రం కేంద్రం ఎలాగైనా మూడు రాజధానులను అడ్డుకోవాలని కోరుకుంటోందని ఆయన విమర్శలు గుప్పించారు .
టీడీపీ అనుమానాలకు తగ్గట్టే జీవీఎల్ కు విజయసాయి మద్దతు
ఇక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విజయసాయి రెడ్డి రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్లో సంబంధిత మంత్రి వెల్లడించారని పేర్కొన్నారు . అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు అని పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుందని నిప్పులు చెరిగారు. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఏపీలో జీవీఎల్, విజయసాయిల వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ
ఇక వైసీపీ ఎంపీ, బీజేపీ ఎంపీని వెనకేసుకురావటం వెనుక లోపాయికారీ ఒప్పందం ఏదో ఉందని , వైసీపీకి జీవీఎల్ ఏజెంట్ అని అందుకే విజయసాయి రెడ్డి కూడా జీవీఎల్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి ఆరోపణలకు తగ్గట్టే వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.