వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?;యథా బాబు...తథా రామయ్య:వైసిపి ఎంపీ
విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సిపి ఎంపీ వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్ల రామయ్య తీరుపై మండిపడ్డారు.
మచిలీపట్నం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారని వైసిపి ఎంపి వర ప్రసాద్ చెప్పారు. ఆయన పక్కనున్న టీడీపీ నాయకులు కూడా ఆయన్ని మరి కాస్త రెచ్చగొట్టారన్నారు. కనీసం ఇంగితజ్ఞానం మరచి వర్త రామయ్య నీ కులమేమిటని విద్యార్థిని ప్రశ్నించారన్నారు.
ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని యువకుడిని తిట్టిపోశారని...ఏం? వర్ల రామయ్య గారి పిల్లలు ఫోన్లు వాడరా?...పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా?....అని ఎంపి వరప్రసాద్ ప్రశ్నించారు. అసలు ఎవరినైనా కులం అడగటం ఏం సంస్కృతి?...ఆయన అనాల్సిన మాటలేనా అవి! అని ఎంపీ వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా యథా బాబు...తథా రామయ్య లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో దళితులను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారని గుర్తుచేశారు. అందుకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేమని అని వరప్రసాద్ వ్యాఖ్యానించారు.