లోకేష్ తిండిపైన వైసీపీ వర్సెస్ టీడీపీ .. టేస్టి ఫుడ్ కోసం తాడిపత్రికి మాలోకం..
లోకేష్ తాడిపత్రి టూర్ తిండి మీద మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లోకేష్ తాడిపత్రి టూర్ పై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక విజయసాయికి టీడీపీ నేతలు రివర్స్ పంచ్ ఇస్తున్నారు . టేస్టీ ఫుడ్ జరుగుతుందంటే ఎక్కడ వరకు అయినా వెళ్తాడు మాలోకం అంటూ నారా లోకేష్ టార్గెట్ గా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే అంటూ టీడీపీ నేత బుద్దా ఎదురు దాడి చేశారు.
పదహారు రకాల వంటలు చేయించుకొని సుష్టుగా భోంచేసి చెక్కేసారు
ఎప్పుడు చూసినా లోకేష్ ను పప్పు, మాలోకం అంటూ సంబోధిస్తూ తిండిబోతుగా చిత్రీకరించే వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాడిపత్రి టూర్ లో కూడా పదహారు రకాల వంటలు చేయించుకొని సుష్టుగా భోంచేసి చెక్కేసారు అని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే పరామర్శలు పలకరింపులు, ఇక టేస్టీ ఫుడ్ దొరుకుతుంటే ఎక్కడి వరకు అయినా వెళ్లి వస్తారు మాలోకం అంటూ లోకేష్ పై వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు తాడిపత్రి వచ్చిన లోకేష్ బాబు ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలు విసుక్కుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గంటకు ఐదు లక్షలు ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వకేట్ల ఇళ్ల ముందు టీడీపీ నేతల క్యూ
ఇక మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి టీడీపీ నేతల కేసుల అంశంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. గంటకు ఐదు లక్షలు ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వకేట్ల ఇళ్ల ముందు క్యూ కడుతున్నారట టిడిపి నేతలు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులు కూడా బాస్ కోసం అదే పనిలో ఉన్నారట. ఎవరికి వారు ఈయన కాపాడలేడు అనుకున్నారేమో లాయర్లకు అడ్వాన్సు ఇచ్చి గండం నుంచి బయట పడేయమని ప్రాధేయ పడుతున్నారట అంటూ విజయసాయి రెడ్డి టిడిపి నేతలపై ఉన్న కేసుల వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ డైట్ లో భాగంగా ఆకుకూరలతో భోజనం .. సొంత క్యారేజ్ అన్న బుద్దా వెంకన్న
ఇక విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ని చూసి భయపడుతున్నారు కాబట్టి ప్రతి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. లోకేష్ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లడం చూసి వణుకుతున్నావా ఏంటి విజయసాయి రెడ్డి గారు అంటూ బుద్ధ వెంకన్న మాటకు మాట వినిపించారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన బుద్ధ వెంకన్న తాడిపత్రిలో లోకేష్ తనతో పాటు తెచ్చుకున్న క్యారేజ్, అది కూడా డైట్ లో భాగంగా ఆకుకూరలతో భోజనం తిన్నారు అని బుద్ధ వెంకన్న 16 రకాల వంటలు వండించుకుని సుష్టుగా తిన్నాడు అన్నదానికి సమాధానంగా చెప్పారు.
Recommended Video
అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే
ఇక దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అదే మీ తింగరి మాలోకం వైయస్ జగన్ రేంజ్ అంటూ బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. అవినీతి సొమ్ము బొక్కడానికి, తండ్రి శవాన్ని తాకట్టుపెట్టి సీఎం అవ్వాలి అనుకున్నారని, ఓదార్పు అంటూ శోకాలు పెట్టారని పేర్కొన్నారు. పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేశారు అని విమర్శించారు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఏపీలో జెసి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ తాడిపత్రి టూర్, లోకేష్ ఫుడ్ టార్గెట్ గా మాటల యుద్ధం జరుగుతోంది.