విజయసాయే పిఎం ఆఫీసు నుంచి ఐటి దాడులు చేయిస్తున్నాడు:మంత్రి ఉమ;టిడిపి చిల్లర రాజకీయం:వైసిపి
విజయవాడ:వైసిపి నేత విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో కూర్చుని టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, బీజేపీ,పవన్ లపై మండిపడ్డారు.
బీజేపీ, వైసిపి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి దేవినేని ఉమ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి ఉమ స్పష్టం చేశారు. బీజేపీ డైరెక్షన్లోనే జగన్, పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. ఈ దొంగల కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.
వైసిపి మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి టిడిపి ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అడ్డదారిలోనైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజక వర్గంలో నాలుగు నుంచి ఐదు వేల ఓటర్లను తొలగించడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం దీని కోసమే నగర దీపికలు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ ఏర్పాటు చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లు, ఊళ్లో ఉన్నవాళ్లు వలస పోయినట్లుగా చూపించి ఆ విధంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక టీడీపీ నాయకులు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు టిడిపి చిల్లర రాజకీయాలపై వైసిపి కార్యకర్తలు అప్రమప్తంగా ఉండాలని...రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలికి ఇలా ఓట్లను తొలగిస్తున్నారని శ్రీనివాసరెడ్డి సూచించారు. కాబట్టి ముందుగా వైసిపి కార్యకర్తలు అసలు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకవేళ లేనట్లైతే ఎందుకు తొలగించారో సంబంధిత అధికారులను నిలదీయాలని ఆయన సూచించారు.