రఘురామ విషయంలో లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు .. అనర్హతా పిటీషన్ అందజేత
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో వైసిపి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ ను వైసిపి ఎంపీలు స్పీకర్ కు అందజేశారు.రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను ఆ పార్టీ నాయకత్వం కోరినట్లుగా తెలుస్తుంది.
రఘురామ కృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ కు రంగం సిద్ధం ? ఈ చర్యతో అందరికీ వార్నింగ్ !!
నేడు ఎంపీలు,లాయర్లతో కూడిన బృందం ఢిల్లీ చేరుకొని ఢిల్లీ వేదికగా రఘురామ లోక్సభ సభ్యత్వం రద్దు చేయించి రాజకీయాల నుంచి దూరం చేయాలన్న ఎత్తుగడతో స్పీకర్ ను కలిసి అనర్హత పిటిషన్ ను అందించారు.రఘురామకృష్ణంరాజు వైసీపీకి వ్యతిరేకంగా,పార్టీ నాయకులకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో షోకాజ్ నోటీసు జారీ చేయగా ఆ షోకాజ్ నోటీసుకు రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తూర్పారబట్టారు.అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం లేఖ రాసి సంచలనం సృష్టించారు.
అనర్హత వేటు వేయించాలని వైసిపి నేతలు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.తనపై విధించే అవకాశం ఉన్న సస్పెన్షన్, అనర్హత వేటులను అడ్డుకోవాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు ఢిల్లీ వెళ్లిన వైసిపి బృందాల వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు,మిథున్ రెడ్డి, మార్గాని భరత్,నందిగం సురేష్ తదితరులు ఉన్నారు.
రఘురామకృష్ణంరాజు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అటు రఘురామకృష్ణంరాజు కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు హైకోర్టును ఆశ్రయించి తన ప్రయత్నాలలో తాను ఉన్నారు. పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఏకంగా అనర్హత వేటు వేయించి రఘురామ తరహాలో అసమ్మతి గళం వినిపించే నేతలకు ఇది ఒక హెచ్చరికలా ఉండాలని వైసిపి అధిష్టానం భావిస్తోందని నేపథ్యంలో రఘురామ విషయంలో సీరియస్ గానే వ్యవహరిస్తోంది.