వైసీపీ నవరత్నాలు భవిష్యత్ లో నవ గ్రహాలు.. జగన్ సొంత చట్టాలు అమలు కావు : చంద్రబాబు
టిడిపి అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఏపీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత వైసీపీ నేతలు చంద్రబాబు పర్యటనపై మాట్లాడుతున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారని, చివరకు స్పీకర్ తీరు కూడా అదే విధంగా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
కొడాలి నానీ బాటలో మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ .. చంద్రబాబుపై ఘాటుగా ..
నవరత్నాలు భవిష్యత్తులో నవగ్రహాలు గా మారుతాయన్న చంద్రబాబు
కడపలో మూడో రోజు పర్యటిస్తున్న ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచకాలు పెరిగిపోయాయని, దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. అధికారం అడ్డుపెట్టుకుని అణగదొక్కాలని చూస్తే సహించం అని పేర్కొన్నారు. వైసిపి అమలు చేయాలనుకుంటున్న నవరత్నాలు భవిష్యత్తులో నవగ్రహాలు గా మారుతాయని చంద్రబాబు విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అటువంటి ఆయన ఇప్పుడు పారదర్శక పాలన అంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ చెడగొడుతున్నారని ఫైర్
వైసీపీ మంత్రులు రాజధానిని స్మశానంతో పోలీసు అమరావతిని చంపి, భ్రష్టుపట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న మంచి పేరును, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను చెడగొట్టడానికి వైసిపి ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు రాకుండా చేసి, ఏపీ విశ్వసనీయతను సైతం దెబ్బతీస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న పనులు యువతకు అర్థం కావాలన్నారు.
అమరావతిలో ఏం జరుగుతుందో చెప్పేందుకే రాజధాని పర్యటన అన్న బాబు
అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని, అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో గురువారం పర్యటిస్తున్నానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే కచ్చితంగా వారే ఇబ్బంది పడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన చట్టాలు అమలు అవుతాయి కానీ జగన్ సొంత చట్టాలు అమలు కావని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీ నేతలు పాప పరిహారం చేసుకునే రోజు త్వరలోనే అన్న మాజీ సీఎం
వైసీపీ నేతలు పాప పరిహారం చేసుకునే రోజు త్వరలోనే వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల బాధలు వర్ణనాతీతమని, ఇల్లు కట్టుకుందామనుకునేవారికి ఇసుక దొరకడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ వల్ల ఎంతో మంచి జరిగిందన్నారు. జగన్ చెప్తున్న నవశకం నోటి మాటలతో రాదని చంద్రబాబు పేర్కొన్నారు.