జేసీ బ్రదర్స్ కు ఒకటో నంబర్ హెచ్చరికలు..! తప్పుచేస్తే తాట తీస్తామంటున్న వైసిపి నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే.. ఏపీలో ఎన్నికల వేడి ముగిసినా ఆ పాతకక్షల వేడి మాత్రం చల్లారడం లేదు. అనంతపురం జిల్లాను ఏలిన జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు చెక్ చెప్పే పనిలో వైసీపీ బిజీగా ఉంది. వారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేసిన అక్రమాలను అడ్డుకునే దిశగా వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ హయాంలో అనంతపురం రాజకీయాలను శాసించిన జేసీ బ్రదర్స్.. ఇప్పుడు వైసీపీ గెలవడంతో సైలెంట్ అయ్యారు.
జేసీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా గెలవకపోవడంతో వారి అరాచకాలపై ఇక వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. తాజాగా జేసీ బ్రదర్స్ పై వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు. తాను తలుచుకుంటే జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో ఉండలేరని.. ప్రజలు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అదంతా తమ ప్రభుత్వ చలువేనని పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ఇప్పటికీ టీడీపీ హయాంలో పెట్టిన మట్కా పేకాట కొనసాగిస్తూ వారితో డబ్బులు వసూలు చేయిస్తున్నాడని కేతిరెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో మట్కా లేకుండా చేస్తానన్నారు. 'నేను తలుచుకుంటే ఒక గంట కూడా జేసీ ఫ్యామిలీ తాడిపత్రిలో తిరగలేదు. నేను.. 'అయ్యో పాపం' అనుకుని వారిని (టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు) వదిలేశాను.
కాబట్తే, వారు ఇంకా ఉన్నారు' అని, హెచ్చరించారు.గవర్నెన్స్ అంటే ఏమిటి? గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది? అన్నది త్వరలోనే అందరికి తెలిసొచ్చేలా చేస్తానని ఏపి సీయం వైయస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ ప్రకటన చేసారు. అందులో బాగంగానే పకడ్బందీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే.. జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. అని జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఉద్బోదించారు.
అందులో బాగంగా అవినీతిని, దౌర్జన్యాలను పారదోలతానని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనంతపురం నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇసుక మాఫియా నుండి పోలవరంలో జరిగిని అవకతవకలపై ఉక్కు పాదం మోపడమే కాకుండా టీడిపి నేతల అక్రమ వ్యాపారాలకు కూడా చెక్ పెడతానని ఏపి సీఎం ప్రకటించారు. అనంతపురం తాడిపత్రిలో జేసి బ్రదర్స్ కు వైసీపి నేతలు గట్టి ఇస్తున్నారు. అక్రమ వ్యాపారాలన్నింటిని మూసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.