మమ్మల్ని హత్య చేసేందుకు మరో కుట్ర: బుద్దా..ఉమాలకు నోటీసులు: పిన్నెల్లి సారధ్యంలో ప్లాన్..!
అమరావతి: మాచర్లలో జరిగిన ఘటన ఇప్పుడు మరో టర్న్ తీసుకుంటోంది. ఈ నెల 11న మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్లపై జరిగిన దాడిపై విచారణ కోసం టీడీపీ నేతలిద్దరినీ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగానూ అధికార పార్టీ పైన విమర్శలకు కారణమైంది. పోలీసు శాఖ సైతం దీని మీద ఫోకస్ చేసింది.
అయితే, తాము ఈ విచారణకు హాజరు కాబోమని..తమను హతమార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. పోలీసులతో నోటీసులు పంపి తమను చంపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో..టీడీపీ నేతల నిర్ణయం పైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పిన్నెల్లి సారధ్యంలోనే జరిగిందంటూ..
టీడీపీ నేతలు బుద్దా వెంకన్న..బోండా ఉమా పైన మాచర్లలో జరిగిన ఘటన పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడకు వచ్చామని చెప్పటంతో..వారు ఎవరికి సమాచారం ఇచ్చారు..ఎప్పుడు ఇచ్చారనే కోణంలోనూ పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు కేసు విచారణ నుంచి గురజాల సీఐ ఓ.దుర్గాప్రసాద్ను తప్పించి గురజాల డీఎస్పీ శ్రీహరి బాబుకు అప్పగించారు.సంఘటన జరిగిన సమయంలో గురజాల డీఎస్పీ స్పందించిన తీరుపై బాధితులు విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అధికారి ద్వారానే విచారణ జరిపించడం వలన మరింత పకడ్బందీగా నేర నిర్ధారణ చేయవచ్చని భావించి గురజాల డీఎస్పీని నియమించామని పోలీసు అధికారులు వెల్లడించారు.
పోలీసులదే బాధ్యత
విచారణకు హాజరయ్యే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీసుశాఖదే అన్నారు. అప్పటికీ అభ్యంతరాలు ఉంటే బాధితులు ఉన్న ప్రాంతానికే విచారణ అధికారి వచ్చి వారి వాంగ్మూలం నమోదు చేస్తారన్నారు. కాగా కేసు విచారణలో భాగంగా వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని, ఆధారాలతో మంగళవారం తన కార్యాలయానికి రావాలంటూ గురజాల డీఎస్పీ సోమవారం విజయవాడ వచ్చి బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావులకు నోటీసులు జారీ చేశారు.
మమ్మల్ని హతమార్చటానికే..రావటం లేదు..
అయితే, పోలీసులు విచారణకు పిలిచినా..తాము హాజరు కాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. తమ మీద దాడి జరిగినప్పుడు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎలాగైతే సమాచారం ఇచ్చారో.. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులతో ఈ నోటీసును పంపించి మమ్మల్ని హతమార్చాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు ఆంధ్రా పోలీసుల మీద నమ్మకం లేదని... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పోలీసులు నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మేము హైకోర్టు ద్వారా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరతామని చెప్పుకొచ్చారు.
Recommended Video
రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు: బుద్దా వెంకన్న
ఈ నెల 11న మా మీద దాడి జరిగిన తర్వాత డీజీపీ మా ఫోన్లను టాప్ చేయించి.. కాల్ డేటా తీసి.. తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామో ఎంక్వైరీ చేసి.. మాపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని..తమకు ప్రాణహాని ఉందని మాచర్ల ఘటనతో తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమకు రక్షణ కల్పించి నిజాయితీని నిరూపించుకోవాలని బుద్దా డిమాండ్ చేశారు. అదే విధంగా..పోలీసులపై తమకు నమ్మకం లేదని..తమపై దాడి చేసినోళ్లపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వదిలేశారని.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామంటూ బొండా ఉమ స్పష్టం చేశారు. దీంతో..ఇప్పుడు దీని పైన అటు అధికార పార్టీ..పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.