టీడీపీ ఎమ్మెల్సీలు లొంగుతారా: చంద్రబాబుతో నిలిచేదెవరు: టీడీఎల్పీ కీలక భేటీ..నలుగురు డుమ్మా..!
టీడీపీ ఎమ్మెల్సీలపైన ఒత్తిడి పెరుగుతోంది. మండలి రద్దు వ్యవహారంలో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్సీలతో అధికార పార్టీ నేతలు టచ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పుడు నిలబడినవారే చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారంటూ వారి మనసు మారకుండా మైండ్ గేమ్ మొదలు పెట్టారు. తమ పార్టీ నుండి ఎవరూ జారిపోరని టీడీపీ ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీలు ఫోన్లు స్విచాఫ్ చేసారు. మరి కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయటం కోసం టీడీఎల్పీ కీలక భేటీ ఈ రోజు ఏర్పాటు చేసారు. ప్రభుత్వ వ్యూహాలు..మండలి రద్దు ప్రచారం..సెలెక్ట్ కమిటీ భవితవ్యం..పార్టీ పరంగా పోరాటం పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఒత్తిడిలో టీడీపీ ఎమ్మెల్సీలు..
మండలి రద్దు ప్రతిపాదన..ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు వస్తున్నాయనే వార్తలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడుతున్నారు. పలువురు ఎమ్మెల్సీలను ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రముఖులు సంప్రదించి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని.. తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి కొందరు ఎమ్మెల్సీలు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఒత్తిడికి ఎమ్మెల్సీలు లొంగిపోవడం అంత తేలిక కాదని టీడీపీ అంచనా వేస్తోంది. తమ ఎమ్మెల్సీలెవరిలోనూ వేరే ఆలోచన కనిపించడం లేదని, అందరూ నాయకత్వంతో టచ్లో ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు మైండ్ గేమ్...
తమ పార్టీ ఎమ్మెల్సీలు ఎవరూ అధికార పార్టీ వ్యూహాల్లో చిక్కుకోకుండా అడ్డుకొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త గేమ్ ప్రారంభించారు. 1984లో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోరాటంలో యాక్టివ్ గా పాల్గొన్న వారికి పిలిచి తరువాత టిక్కెట్లు ఇచ్చామని..ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మండలిలో రెండ్రోజుల క్రితం జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్సీల ప్రతిష్ఠ బాగా పెరిగిందని.. మమ్మల్ని ప్రజలు హీరోల్లా చూస్తున్నారని..వందల సంఖ్యలో అభినందన సందేశాలు అందుతున్నాయి. ఈ వాతావరణంలో ఎమ్మెల్సీలు పార్టీ మారతారని అధికార పార్టీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. ఇక, మండలి రద్దు ఖాయమనే సంకేతాలు ఎమ్మెల్సీలపై మరింత ఒత్తిడి పెంచుతోంది. సోమవారం కేబినెట్ సమావేశం జరిగే వరకూ దీని పైన సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.
టీడీఎల్పీ భేటీ..నలుగురి డుమ్మా
టీడీఎల్పీ సమావేశం ఆదివారం కేంద్ర కార్యాలయంలో జరుగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. భవిష్యత్ కార్యక్రమంపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలా వద్దా అన్నది కూడా ఈ సందర్భంగా నిర్ణయిస్తారు. నలుగురు ఎమ్మెల్సీలు తాము టీడీఎల్పీ భేటీకి రాలేకపోతున్నామని ముందుగానే నాయకత్వానికి సమాచారమిచ్చారు. మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడి వర్ధంతి ఉన్నందువల్ల రాలేకపోతున్నానని ఆయన సతీమణి.. ఇటీవల చనిపోయిన తన సోదరికి సంబంధించి కుటుంబ కార్యక్రమాలు ఉన్నందువల్ల రావడం లేదని కర్నూలుకు చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తన దగ్గరి బంధువుల వివాహ కార్యక్రమం వల్ల రావడం లేదని అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి.. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు సమాచారమిచ్చారు. సోమవారం మాత్రం వస్తామని వారు చెప్పినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.