"నారా హమారా...టిడిపి హమారా"కు పోటీగా...లక్షమంది ముస్లింలతో వైసిపి బహిరంగసభ
గుంటూరు:గుంటూరు బిఆర్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన "నారా హమారా...టిడిపి హమారా" ముస్లిం మైనార్టీల సభపై వైసిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడచిన తర్వాత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు రాలేదా?...అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజద్బాషా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తరువాత ఆయన ఆధ్వర్యంలో నవంబరు నెలలో లక్ష మంది ముస్లిం మైనార్టీలతో గుంటూరు వేదికగా భారీ బహిరంగసభ నిర్వహిస్తామని ఆ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్బాషా ప్రకటించారు.
గుంటూరులోని వైసిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముస్లిం సమాజాన్ని మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు గుంటూరులో 'నారా హమారా' పేరుతో సభ నిర్వహించారని ఆరోపించారు. మొన్నటి వరకూ బీజేపీతో దోస్తీ చేసి నేడు వైసీపీపై దుష్ప్రచారం చేయటం సిగ్గు చేటన్నారు.
అనంతరం వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఎం రెహమాన్ మాట్లాడుతూ వంద మంది చంద్రబాబులు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని స్పష్టం చేశారు. వంద మంది చంద్రబాబులు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆపలేరన్నారు. ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు టోపీలు పెట్టి ముస్లింలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారని చెప్పే ప్రయత్నాలను చేస్తున్నారని ఆరోపించారు.
మతతత్వ పార్టీ అయిన బీజేపీ సైతం ముస్లింలకు కేంద్రంలో మంత్రి పదవి కేటాయించగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటిదాకా ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించలేదని కడప ఎమ్మెల్యే అంజద్బాషా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడినా ముస్లిం మైనార్టీల ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కేవలం ఎన్నికలకు ముందు ముస్లిం మైనార్టీలకు ఏదో చేస్తున్నట్లు ఊదరగొట్టి మరోసారి ఓట్ల కోసం వారిని మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అంజద్బాషా దుయ్యబట్టారు.
గుంటూరులో "నారా హమారా.. టీడీపీ హమారా"...అంటూ టిడిపి బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని కేవలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలోనే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి 200 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా చేసిన నాయకుడు వైఎస్సార్ మాత్రమేనని, ఆయనను ఎన్నటికీ మరువలేమని అంజద్బాషా స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబును ఎవరూ నమ్మరని ఆయన విమర్శించారు.
భారతదేశంలో అవినీతిలో ప్రత్యేక ముద్ర వేసుకొని నంబర్ వన్ స్థానంలో ఉన్న చంద్రబాబుకే అవినీతి సామ్రాట్ బిరుదు ఉందని...ఆ అవినీతి పుత్రుడే లోకేష్బాబు అని ఎమ్మెల్యే అంజద్బాషా ధ్వజమెత్తారు. 'సారే ఆంధ్ర ముసల్మాన్ కా ఏక్ హి... వైఎస్సార్ హమారే' అనేది ముస్లింల నినాదమని...ఇది టీడీపీ పాలకులు తెలుసుకోవాలని తేల్చిచెప్పారు.
వంద మంది చంద్రబాబులు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఎం రెహమాన్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని నిఘా వర్గాల ద్వారా తెలిసి, మైనారిటీ వర్గాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వి.ఖాదర్ బాషా, ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు టోపీలు పెట్టి ముస్లింలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారని చెప్పే ప్రయత్నాలను చేస్తున్నారని మండిపడ్డారు.