ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలు
అమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఆ క్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
ప్రజావేదికపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం తగదంటున్నారు విజయసాయి రెడ్డి. ఆ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజావేదిక విషయంలో టీడీపీ లీడర్లు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదిక టీడీపీ సొంతం కాదని.. అది ప్రభుత్వ నిధులతో నిర్మించిందని స్పష్టం చేశారు. అలా నిర్మించిన ప్రజావేదికను టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Recommended Video
ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!
టీడీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు ప్రజావేదికను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం (24.06.2019) నాడు ప్రజావేదికను కలెక్టర్ల సదస్సుకు సిద్ధం చేస్తున్న తరుణంలో దాని తాళాలు ఎలా తీస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేవలం సానుభూతి కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా కూడా పరువు తీసుకోవడమే తప్ప దేనికి పనికిరాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పనిలోపనిగా మాజీ మంత్రి బొండా ఉమాపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని ఆయన కోరడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే తనను పట్టుకోవాలని దొంగ పోలీసులకు సవాల్ విసిరినట్లుగా ఆయన తీరు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మీ దోపిడీలన్నీ కూడా బయటకొస్తాయి.. ఎవరూ తప్పించుకోలేరు ఉమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.