మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కితాబు
నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పలువురు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ కు వెళ్లి తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం లేని నేత అని కొనియాడారు. ఇదే సమయంలో వైయస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీలోని నాయకులను వ్యతిరేకిస్తూనే, పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ నే మరోపక్క ఆసక్తికరమైన లేఖలు రాస్తున్నారు. ఇదే సమయంలో వైయస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మనసున్న మారాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ని కొనియాడారు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన చేసిన పాదయాత్ర వలన రాష్ట్రంలో మనోరంజకంగా పాలన చేయగలిగారని పేర్కొన్నారు. అంతేకాదు జలయజ్ఞంతో వృధా జలాల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత వైయస్సార్ కి దక్కుతుందన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది అని కొనియాడారు. ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేసిన ఘనత వైయస్సార్ దే అని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రజలు, ప్రజాప్రతినిధులతో నిత్యం మమేకమై పాలన సాగించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్
అందరికీ నేనున్నాననే భరోసా కల్పించారని వైయస్సార్ ని కొనియాడుతూ రఘురామకృష్ణంరాజు ప్రకటన విడుదల చేశారు. ఒకపక్క పార్టీ రఘురామకృష్ణంరాజుని అనర్హుడిగా ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో కూడా మనసున్న మారాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.