వైసిపి బంద్ విఫలం...మోడీని విమర్శిస్తే జైల్లో వేస్తారని జగన్ భయం: మంత్రి పుల్లారావు
Recommended Video
అమరావతి:ప్రత్యేక హోదా కోసం నినాదంతో వైసిపి నేడు చేస్తున్న బంద్ విఫలం అయిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి, జగన్,బిజెపిల పై విమర్శల వర్షం కురిపించారు.
విభజనతో నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నష్టపరిచేందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి బంద్కు పిలుపునిచ్చారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర బంద్ వల్ల ప్రయోజనం ఏమిటని, ఏ ప్రయోజనంతో బంద్కు పిలుపునిచ్చారని వైసిపిని ఆయన ప్రశ్నించారు. వైసిపి మనుగడ కోల్పోతున్న తరుణంలో వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ బంద్ చేస్తున్నారని పుల్లారావు ఎద్దేవా చేశారు.
వైసిపి...హాస్యాస్పదం
ప్రధానమంత్రి మోడీని ఒక్కమాట కూడా అనలేని వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంపై పోరాడుతున్న టిడిపికి వ్యతిరేకంగా బంద్ చేయడం హాస్యాస్పదమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా మోడీని ఒక్కమాట అనలేని దుస్థితి జగన్ దని అన్నారు.
జైల్లో వేస్తారని...జగన్ భయం
మోడీని విమర్శిస్తే 24 గంటల్లోపల జైల్లో వేస్తారనే భయం జగన్కు ఉందని మంత్రి పుల్లారావు ఎద్దేవా చేశారు. వైసిపి ఇటు అసెంబ్లీ నుంచి అటు పార్లమెంట్ నుంచి పారిపోయి రాష్ట్రానికి ద్రోహం చేసిందని అన్నారు. 5 కోట్ల ప్రజల ప్రయోజనాలను కాపాడాలనే చిత్తశుద్ధి జగన్కు ఉంటే మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని చెప్పారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఢిల్లీలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో బంద్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
అభివృద్దిని...అడ్డుకోవాలనే
ఆంధ్రప్రదేశ్లో టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే వైసిపి కుటిలయత్నమని పుల్లారావు ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. ఏ ప్రాంతీయ నాయకుడు కూడా జగన్లా ప్రతి శుక్రవారం కోర్డు బోనులో నిల్చువడం లేదన్నారు.
మూల్యం...చెల్లించుకోక తప్పదు
వైసిపి బంద్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పితే కేంద్రాన్ని నిలదీయడానికి కాదని పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 51 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, ఆ పార్టీతో అంటకాగుతున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి పుల్లారావు జోస్యం చెప్పారు.