మసక బారుతున్నబొత్స చరిష్మా..! వర్గ పోరులో వెనకడుగు..!!
బొత్స సత్యనారాయణ.! ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు గురించి ప్రస్తావించకుండా ఆ పార్టీలో ఎవరూ ఉండలేరు. రాజశేఖర్రెడ్డి హయాం నుంచి, ఆయన కొడుకు జగన్ సారథ్యంలో వరకూ పార్టీ మనుగడకు సత్తిబాబు చూపిస్తున్న రాజకీయ చతురత అనన్య సామాన్యం. అందుకే పార్టీలో ఆయన స్థానం ప్రత్యేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లోనూ, విభజన తర్వాత ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలోనూ ఎప్పటికప్పుడు పార్టీలో ట్రంప్ కార్డ్ పాత్ర పోషిస్తుంటారు. కానీ సొంత జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సత్తి బాబు. దీంతో రచ్చ గెలిచినా ఇంటగెలవలేక వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు బొత్స..!
కాలంతో పాటు పరుగెత్తలేని సత్తిబాబు..! మనోభావాలను దెబ్బతీసిని వాఖ్యలు..!
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రాలో ఓ వెలుగు వెలిగిన నేత బొత్స సత్యనారాయణ. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదురులేని నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజాందోళన మొదలుకొని కాపుల ఉద్యమం వరకు ఆయన తప్పటడుగులు వేస్తున్నారని అనుచరులే వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న బొత్స సత్యనారాయణకి విమర్శల పాలయ్యే స్థితి రావడం వెనుక చాలా కారణాలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయనగరం జిల్లా అంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడు ఆయన "తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటీ" అని వ్యాఖ్యానించారు. దీంతో నాడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సత్తిబాబు సూచనతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని జిల్లావాసులు అనుకున్నారు.
ఒకప్పుడు వెలుగులు..! ప్రస్తుతం చీకట్లు..!!
ఒకానొక దశలో ఆందోళనకారులు ఆయన ఇల్లు కూల్చేయాలని కూడా ప్రయత్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించటం, కర్ఫ్యూ పెట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో సత్తిబాబు పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. కాలక్రమంలో పరిస్థితులన్నీ మారిపోయి కాపుల ఉద్యమం తలెత్తింది. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు కులం బలంగా ఉంది. ఈ సామాజికవర్గానికి చెందిన సత్తిబాబును అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. స్థానిక కాపు నేతలు గొర్లె శ్రీరాములునాయుడు, కిమిడి కళావెంకట్రావు, బొత్స సత్తిబాబు తమ తూర్పుకాపు కులం నుంచి ఎదిగిన గొప్ప నాయకులని ఆ వర్గంవారు చెప్పుకుంటారు.
కలిసిరాని సామాజిక వర్గం.. అనుచరునితో తలనొప్పి..
కాగా విజయనగరం జిల్లాలో బొత్సకు వ్యతిరేకవర్గంగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామితో ఉన్న కొందరు తూర్పుకాపు నేతలు బీసీ-ఏ క్యాటగిరీలో తమ వారిని చేర్చాలన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. కాగా జగన్ చెప్పిన మేరకే ముద్రగడ పద్మనాభానికి సత్తిబాబు మద్దతు తెలిపారనీ, అది ఆయన వ్యక్తిగత వ్యవహారం కాదనీ, పార్టీ నిర్ణయమని మరి కొంతమంది సత్తిబాబు అనుచరులు చెబుతున్నారు. కాగా సత్తిబాబు ఇరకాటంలో పడటానికి స్వయంగా ఆయనే కారకుడని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ బొత్సకు పూర్వవైభవం తిరిగి దక్కాలంటే తిరిగి పక్కా ప్రణాళికతో నడుచుకోవడం అవసరమని పలువురు సూచిస్తున్నారు. లేదంటే బొత్స స్వయంకృతాపరాధిగా మిగిలిపోవడం ఖాయమని అంటున్నారు.
అదినేత ఎవరివైపు..? ఆదుకునేది ఎవరిని..?
అయితే పార్టీ అదినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వతంత్రంతో కోలగట్ల మళ్లీ యాక్టివ్ అయ్యారు. విజయనగరం నియోజకవర్గానికి నీవే అభ్యర్థివి అంటూ జగన్ చేతిలో చేయివేసి చెప్పారంటూ కోలగట్ల చెప్పుకోసాగారు.. పైపెచ్చు కోలగట్ల విజయానికి బొత్స పూర్తి సహకారం అందించాలని ఆదేశించినట్లు కోలగట్ల వర్గం ప్రచారం కూడా చేసుకుంటోంది. ఈ విషయాన్ని బొత్స వర్గం కాదనడం లేదు. అలాగని కోలగట్లతో కలిసి పనిచేసే వాతావరణమూ లేదు. దీంతో అదిష్టానం మాట కాదలేక, సొంతంగా ప్రజల మద్యకు వెళ్లలేక సత్తిబాబు పోటీలో వెనకబడిపోతున్నట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. ఇదే విధానం కొనసాగితే విజయనగరం జిల్లాలో జరగబోయే జగన్ పాద యాత్రలో క్రియాశీల పాత్ర కోటగట్లదీ, ప్రేక్షక పాత్ర బొత్స ది కాక మానదు. జరుగుతున్న పరిణామాల పట్ల సత్తిబాబు ఎంతవరకు అప్రమంత్తంగా వ్యవహరిస్తారో చూడాలి.