రెచ్చగొట్టేది చంద్రబాబే.. అందుకే హత్యలు.. అసత్య ప్రచారమంటూ అంబటి ఆగ్రహం..!
తాడేపల్లి : టీడీపీ వర్సెస్ వైసీపీ. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఆ క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలను హత్యలకు పురిగొల్పుతున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తుంటే.. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి జరుగుతుంటే చంద్రబాబు అసత్య ప్రచారం..!
రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే.. చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైరయ్యారు అంబటి రాంబాబు. బుధవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వారు హత్యలు చేసేలా పురికొల్పుతోంది చంద్రబాబేనంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తను టీడీపీ శ్రేణులు చంపడం దారుణమని వ్యాఖ్యానించారు. కేవలం వైసీపీకి ఓటు వేశారనే కారణంగా తమ కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
చిరంజీవితో ఆ బీజేపీ నేతలు.. అందరూ కలిసి అక్కడికే..!
జగన్ అద్భుత పాలన అందిస్తుంటే.. చంద్రబాబు కంటికి కనిపించడం లేదా?
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలిస్తుంటే.. చంద్రబాబు కంటికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ పాలనకు మంచి మార్కులు పడుతుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. ఆ క్రమంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీని మరో బీహార్గా మార్చాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్పై హత్యాయత్నం జరిగింది చంద్రబాబు హయాంలో అనే విషయం ఆయన మరిచిపోతున్నారని గుర్తు చేశారు. ఏపీలో జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని.. అద్భుతమైన అబద్దాలుగా మలిచి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.
పంచాయతీలు చేసేది ఎవరో మరి..!
కొన్ని విషయాల్లో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు అంబటి. ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేస్తే జైల్లో పెట్టించారని.. ఇప్పుడేమో సిగ్గు లేకుండా మానవ హక్కులంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల మధ్య తగాదాల విషయంలో.. అధికారులపై టీడీపీ లీడర్లు చేసిన దాడులపై పంచాయతీలు చేసింది మీరు కాదా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వనజాక్షిపై చింతమనేని దాడి చేసిన క్రమంలో పంచాయతీ చేసిందెవరో ప్రజలకు తెలుసన్నారు. ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే దాడి చేస్తే పంచాయతీ చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
జగన్పై అసత్య ప్రచారాలు..!
పంచాయతీలు చేయడం ఎలాగో తెలిసిన చంద్రబాబు జగన్పై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. పులివెందుల పంచాయతీ అంటూ అబద్దాలు స్ప్రెడ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు చనిపోయారని చంద్రబాబు ప్రయత్నించడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక చంద్రబాబు చెంప చెళ్లుమనేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.