ఆ నివేదిక సిఎం చంద్రబాబే రాసినట్టుంది:వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్:పుష్కరాల దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్ సోమాయాజులు నివేదిక ఇచ్చారని వైసిపి అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
జస్టిస్ సోమయాజులు తన నివేదికలో తప్పంతా భక్తులదేనని, మూఢ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని రిపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారు, కానీ ఆయన ఏం తేల్చారని ఆమె నిలదీశారు. ఈ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని, ఆయన రాసిన రిపోర్ట్పై జస్టిస్ సోమయాజులు సంతకం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
పుష్కరాల సమయంలో సిఎం చంద్రబాబు స్నానం చేసే వరకు ఎవరిని అనుమతించలేదని, తొక్కిసలాట జరుగుతున్న విషయం సీఎంకు చెప్పమని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారని, సీఎం అక్కడ ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ నివేదిక కూడా ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కానీ సోమయాజులు కమిషనేమో సీఎం వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగిందని చెబుతోందని ఆరోపించారు.
ఖచ్చితంగా పుష్కరాల మరణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. లేని ముహూర్తం పెట్టించి...ప్రచారం మీద యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆమె ద్వజమెత్తారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని ఆమె విమర్శించారు. డాక్యుమెంటరీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానం చేసే దృశ్యం చిత్రీకరించేందుకు డైరెక్టర్ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేశారని ఆమె గుర్తుచేశారు.
పైగా సోమయాజులు కమిషన్ నివేదికలో ఉపయోగించిన భాష కూడా అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి ఆయనకు చేతులెలా వచ్చాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఫుటేజ్ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం చెప్పితీరుతుందని...గోదావరి ఆయనను క్షమించదని అన్నారు. ఈ నివేదికను వైసిపి వ్యతిరేకిస్తుందని...ఆ దుర్ఘటనపై తమ పోరాటం కొనసాగుతుందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.