ఏపీ బంద్: రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆందోళనలు...అరెస్టులు
Recommended Video
అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం టిడిపి-బిజెపి అన్యాయానికి వ్యతిరేకిస్తూ వైసీపీ నేడు చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్లో భాగంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాలలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ బంద్లో భాగంగా షాపులు, స్కూల్స్, కాలేజీలు, వాహనాలు నడువకుండా అడ్డుకుంటున్నారు. గతంలో వైసిపి ఇచ్చిన పిలుపుకు అన్ని పక్షాలు కలసి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి వైకాపా బంద్ కు మాత్రం అధికార పక్షం టిడిపి ఎప్పటిలాగే వ్యతిరేకించగా జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి.
సింగిల్ కార్డ్...క్రెడిట్ కోసం
వైసిపి కూడా అన్ని పక్షాలు బంద్ లో పాల్గొంటే ఎవరికీ క్రెడిట్ దక్కకుండా పోతోందన్న ఆలోచనతో ఈసారి ప్రత్యేక హోదా కోసం ఆందోళన క్రెడిట్ అంతా తమకే దక్కాలని వైసిపి భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసిపి చేపట్టిన ఎపి బంద్ తిరుపతిలో తెల్లవారుఝామునే ప్రారంభం కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా నేత భూమన కరుణాకర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలో...ఎమ్మెల్యే అరెస్ట్
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి, పార్టీ కార్యకర్తలు తెల్లవారు జామున నుంచి ఆర్టిసి గ్యారేజ్ ముందు బైఠాయించారు. పొలీసులు బలవంతంగా గోపిరెడ్డి అడ్డుకొని ఫిరంగిపురం స్టేషన్కు తరలించారు. కర్నూలులోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలు బంద్ పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ, బెంగళూరుకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
బస్సులు...నిలిపివేత
శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట జరిగిన ధర్నాలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం, పలాస డిపోల్లో బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బంద్ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ కార్యకర్తలు బంద్ బంద్ కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి ఎదుట మోహరించారు. అదేవిధంగా రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వైసిపి నేతల...అరెస్టులు
తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైసీపీ నేతలు బంద్ కార్యక్రమం చేపట్టారు. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బస్సులను అడ్డుకున్నారు. కడప జిల్లాలో కూడా వైసీపీ నేతలు బంద్లో భాగంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మేయర్ సురేశ్బాబుతోపాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులలో కూడా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.