జేసీ బ్రదర్స్ టార్గెట్ అంటున్న వైసీపీ..అందుకే ఆర్ధిక మూలాలపై దెబ్బ: అనంతలో చర్చ
అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు అధికార వైసీపీ చుక్కలు చూపిస్తోందా? జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేతలకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు వచ్చాయా? వారి ఆర్ధిక మూలాలపై వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొడుతుందా? అంటే అనంతపురంలో రాజకీయ వర్గాలు అవును అనే చెప్తున్నాయి.
ఆచి తూచి మాట్లాడుతున్న జేసీ బ్రదర్స్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీలో కీలక నాయకులను టార్గెట్ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన అక్రమాలను బయటకు తెస్తుంది. అంతే కాదు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నది టీడీపీ వాదన. ఈ నేపధ్యంలోనే గతంలో టీడీపీ నుండి వైసీపీపై విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్నా ఆచి తూచి మాట్లాడుతున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో జగన్ కు కితాబిస్తున్నారు. వైసీపీ పాలనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వారికి తిప్పలు తప్పటం లేదు .
జేసీ బ్రదర్స్ టార్గెట్ .. ఆర్ధిక మూలాలపై దెబ్బ
అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న జేసీ బ్రదర్స్ టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం వారి ఆర్ధిక మూలాను దెబ్బ తీసే పనీలో బిజీగా ఉందని స్థానికంగా చర్చ జరుగుతుంది . ఇక అసలు విషయానికి వస్తే జేసీ బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నారు . వారు వంద బస్సులకుపైగానే ఇంటర్ స్టేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు . ఇక తాజాగా జరిగిన వాహన తనిఖీల్లో వారి దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించి 31 బస్సులను ఏపీ రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.
జేసీబ్రదర్స్ బస్సులు సీజ్ మాత్రమే కాదు పర్మిట్లు రద్దు
జేసీ బ్రదర్స్ కు సంబంధించిన బస్సులు సీజ్ చెయ్యటానికి వారు చెప్పిన కారణాలు ఏమిటంటే అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక ధరలు వసూలు చేయడం, స్టేజ్ కేరియర్లుగా తిప్పడం . ఇవి కారణాలుగా వారి బస్సులను సీజ్ చేశారు . అయితే ప్రతీ ట్రావెల్స్ బస్సులలోనూ ఇలాంటివి సర్వ సాధారణం . ఇతర ట్రావెల్స్ బస్సుల విషయంలో ఇంతగా పట్టింపు లేని అధికారులు నామమాత్రంగా వాటిని సీజ్ చేశారు. కానీ జేసీ బ్రదర్స్కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడమే కాకుండా బస్సు పర్మిట్లను కూడా రద్దు చేశారు.
వైసీపీ ప్రభుత్వ ఒత్తిడులతోనే జేసీ బ్రదర్స్ పై టార్గెట్
అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు వరకు జగన్ మీద నిప్పు చెరిగిన జేసీ బ్రదర్స్ ఎన్నికల తర్వాత నుండి సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు కాంట్రవర్సి అన్నట్టు వివాదాలకు,వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే అవి టీడీపీకి ఇబ్బంది కలిగించేలా ఉంటున్నాయే కానీ ఏ మాత్రం వైసీపీకి ఇబ్బంది కలిగించేలా లేవు. అయినప్పటికీ జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసి కావాలనే ఆర్ధిక మూలాలపై దెబ్బ వేసినట్టు చర్చ జరుగుతుంది.
టీడీపీకి దూరంగా ఉన్నా తప్పని తిప్పలు
టీడీపీ కార్యక్రమాలలో పాల్గొనటం లేదని , అప్పుడప్పుడు బీజేపీలో చేరతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తమను టార్గెట్ చెయ్యరులే అని జేసీ బ్రదర్స్ భావించినా తాజా పరిణామాలు మాత్రం అలా లేవు. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ముఖ్య అనుచరులపై ప్రబోధానంద ఆశ్రమంపై దాడి ఘటనలో కేసులు నమోదు చేశారు. పలువురు జేసీ అనుచరులను తాజాగా అరెస్టులు చేయడం ప్రారంభించారు.ఇక ఇప్పుడు ఆర్ధిక మూలాలను టార్గెట్ చేసి అనంత పురంలో మోనార్క్ లా చక్రం తిప్పిన నాయకులకు చెమటలు పట్టిస్తున్నారు వైసీపీ నేతలు.