వైసీపీ, టీడీపీ సవాళ్లు.. పులివెందులలో వేడెక్కిన రాజకీయం!
కడప: వైఎస్సార్ జిల్లాలోని పులివెందులలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విసిరిన ప్రతి సవాల్కు టీడీపీ స్పందించింది.
పులివెందులలో వైఎస్సార్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని స్థానిక టీడీపీ నేతలు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సవాల్ను స్వీకరించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు.
అవినాష్ రెడ్డి ప్రతి సవాల్కు స్పందించిన టీడీపీ నేత సతీష్ రెడ్డి శనివారం మాట్లాడారు. ఈ నెల 4 వతేదీ (ఆదివారం) సాయంత్రం తాము చర్చకు సిధ్దమని ప్రకటించారు. మరోవైపు టీడీపీ నేత ప్రకటనకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి స్పందించారు.
ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలమంతా చర్చకు వస్తామని తెలిపారు. టీడీపీ తాను చేయని అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందంటూ శంకర్ రెడ్డి మండిపడ్డారు. పులివెందులతో పాటు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా చర్చిస్తామని శంకర్ రెడ్డి పేర్కొన్నారు.