ఆ నియోజకవర్గాలపై వైసీపీలో టెన్షన్ : రాప్తాడులో ఏం జరిగింది: టీడీపీ ప్లాన్ ఇదే అంటూ..!
మరి కొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి పైన ఆందోళనతో ఉంది. టీడీపీకి కొన్ని చోట్ల అధికారులు వంత పాడుతున్నారని ఆరోపిస్తోంది. అదే సమయంలో కౌటింగ్ లో వైసీపీకి అధిక్యత వచ్చిన ప్రతీ సారి రీకౌంటింగ్ అడగాలని పార్టీ నేతలు ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఇక, టీడీపీ కౌంటింగ్ నాడు గొడవలు సృష్టిస్తుందని వైసీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ నియోజకవర్గాల పైనే టెన్షన్...
ఏపీలో తాజా ఎన్నికల్లో పైకి రెండు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం ఉత్కంఠకు గురువుతున్నారు. దీంతో..కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ హోరా హోరీ పోరు జరిగిన నియోజకవర్గాల్లో పరిస్థితి పైన వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గుడివాడ, తుని, గాజువాక, రాప్తాడు, భీమవరం, చంద్రగిరి మంగళగిరి, గురజాల, ఉరవకొండ, దెందులూరు ధర్మవరం, తాడిపత్రి , రాజంపేట, చిలకలూరి పేట, విశాఖ వెస్ట్ ,గన్నవరం, మైలవరం మొదలైన నియోజకవర్గాలలో గొడవలు సృష్టించడానికి టిడిపి ప్రయత్నిస్తుందని వారు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ముఖ్య నేతలు ఫిర్యాదు చేసారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రత్యేక కేంద్ర బలగాలను మొహరించాలని కోరింది. ప్రధానంగా వైసీపీ గెలిచే సమయంలో టీడీపీ ఏ స్థాయికైన దిగజారే అవకాశాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
కౌంటింగ్లో టీడీపీ ప్లాన్ ఇదే..
ఇక, ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో ఏ రకంగా వ్యవహరించాలో టీడీపీ ఇప్పటికే పార్టీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది. ఆ సమయంలో టీడీపీ నేతలు ఏజెంట్లకు ఏం చేయాలనే దాని పైన ఒక బుక్ లెట్ ముద్రించారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి అభ్యర్థికి మెజారిటీ వస్తే ప్రతిరౌండ్లోను రీకౌంటింగ్కు డిమాండ్ చేయాలని టీడీపీ తన కౌంటింగ్ ఏజెంట్లకు ఆదేశాలు ఇచ్చిందని వైసీపీ నేతల ఆరోపణ. ఈ మేరకు కౌంటింగ్ అధికారులతో గట్టిగా ఒత్తిడి చెయ్యాలని టీడీపీ నేతలు ఏజెంట్లను ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓడిపోయేచోట కౌంటింగ్ ప్రక్రియ వివాదాస్పదం చేసి.. గొడవలకు తెరలేపాలని పార్టీ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం తప్పుడు సలహాలు ఇచ్చిందని వైసీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
రాప్తాడులో ఆర్వోని తప్పించండి...
టీడీపీ..వైసీపీ కీలకంగా భావిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో అక్కడి ఆర్వో టీడీపీకి సహకరించారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. వెలుగు శాఖలో పని చేసే అధికారి అక్కడ ఆర్వోగా ఉన్నారని..కనీసం ఓట్ల లెక్కింపులో అయినా ఆర్వోని తప్పించి..మరొకరికి బాధ్యతలు ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్దించారు. అదే విధంగా అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, ధర్మవరం, తాడిపత్రి నియోజకవర్గాలతో పాటుగా దేవినేని ఉమా పోటీ చేస్తున్న మైలవరం, గన్నవరం వంటి నియోజకర్గాల్లో ఇప్పటికే వైసీపీ నేతలకు హెచ్చరికలు వస్తున్నాయని..దీనిని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాల పరిస్థితుల పైన ఫిర్యాదులు వచ్చిన పరిస్థితుల్లో ఎటువంటి చర్యలకు ఆదేశిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.