ఏపీ ఫ్యాక్ట్స్ : అభ్యర్థుల్లో ఒక పార్టీలో ధనవంతులు, మరో పార్టీలో క్రిమినల్ కేసులున్నవారు ఎక్కువ!
గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఓట్ల పండగ మొదలు కానుంది. ఇప్పటికే ప్రచారం ముగియడంతో ఇక ఓటర్ల నాడి ఎలా ఉంటుందో పసిగట్టే పనిలో నేతలు పడ్డారు. ఇదిలా ఉంటే నేరచరిత్ర కలిగిన నాయకులు, ధనవంతులైన నాయకులు ఎంతమంది ఏ పార్టీ నుంచి పోటీచేస్తున్నారు అనేదానిపై ఓ సర్వే జరిగింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
కేసీఆర్ను చిక్కుల్లో పడేసిన హిందూ గాళ్లు బొందుగాళ్లు కామెంట్..?
ఈ పార్టీలోనే నేరచరితులు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్... ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటినుంచి ప్రతిఒక్కరి నోళ్లలో నానుతున్న రాష్ట్రం. పోలింగ్కు సమయం దగ్గరపడే కొద్దీ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల చరిత్ర గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థలు పలు అంశాలపై పరిశోధన జరిపి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి. మొత్తం 2118 అభ్యర్థుల అఫిడవిట్లకు గాను 2007 మందికి చెందిన అఫిడవిట్లను పరిశీలించి కొన్ని విషయాలను తెలిపింది.ఇందులో ముందుగా నేరచరిత కలిగిన వారు ఎక్కువమంది వైసీపీలో ఉన్నట్లు తేల్చింది. 97 మంది వైసీపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఈ పరిశోధనల్లో తేలింది. టీడీపీ నుంచి పోటీచేస్తున్న 48 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏపీఈడబ్ల్యూ-ఏడీఆర్ సంస్థలు పేర్కొన్నాయి. ఇక అత్యంత సీరియస్గా పరిగణించబడే క్రిమినల్ కేసులు 57 మంది వైసీపీ అభ్యర్థులపై ఉండగా 27 మంది టీడీపీ అభ్యర్థులపై కూడా ఉన్నాయి. అంటే ఈ నేరాలు రుజువైతే ఎంత లేదన్నా ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కేసుల్లో బెయిల్ కూడా దొరకదని తెలుస్తోంది.
ఇదీ అభ్యర్థుల ఆర్థిక గణాంకాలు
ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థలు అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిపై కూడా పరిశోధన చేసి నివేదిక రూపొందించింది. 2007 మంది అభ్యర్థుల్లో 632 మంది కోటీశ్వరులుగా ఉన్నట్లు తేల్చింది. అదే 2014లో 1309 మంది అభ్యర్థుల్లో 470 మంది కోటీశ్వరులుగా ఉన్నారని పేర్కొంది. వైసీపీ నుంచి బరిలో ఉన్న 159 మంది కోటీశ్వరులుండగా... టీడీపీ నుంచి 157 మంది కోటీశ్వరులు. ఇక సామాన్యుడి పార్టీ జనసేనలో 65శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులని నివేదిక వెల్లడించింది. ఇక ఆస్తులు ప్రకటించి అత్యంత ధనికులుగా నిలిచిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో టీడీపీకి చెందిన వారే ఉన్నారు. అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.
చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఇవే..!
నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన కృష్ణయ్య బొల్లినేని 689 కోట్ల రూపాయల ఆస్తులను డిక్లేర్ చేశారు. ఇక మంత్రి నారాయణ రూ.668 కోట్లు ఆస్తులు ప్రకటించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తులను రూ.668 కోట్లు ప్రకటించారు.ఇక 54 మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఆదాయపు పన్ను రూపంలో గతసారి రూ.25 కోట్లు కట్టారు. ఆ తర్వాత రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మేడా వెంకట మల్లికార్జున రెడ్డి 16 కోట్లు ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ కోటి రూపాయలు ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు.
అభ్యర్థుల విద్యార్హతలు
ఇక విద్యార్హతల విషయానికొస్తే 901 మంది అభ్యర్థులు 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య చదువుకున్నట్లు తెలిపగా... 957 మంది అభ్యర్థులు డిగ్రీ లేదా అంతకన్నా పైచదువులు చదివినట్లు వెల్లడించారు. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు 648 మంది ఉండగా... 1128 మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నారు. 220 మంది 61 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉండగా నలుగురు అభ్యర్థులు తమ వయస్సు 80 ఏళ్లకు పైగా ఉంటుందని డిక్లేర్ చేశారు. మరోవైపు ఏడుగురు అభ్యర్థులు తమ వయస్సును పేర్కొనలేదు.